వచ్చే ఐదేళ్లలో భారత్‌ను ప్రపంచ శక్తిగా మార్చే ఎన్నికలివి: ప్రధాని మోడీ

by Dishanational1 |
వచ్చే ఐదేళ్లలో భారత్‌ను ప్రపంచ శక్తిగా మార్చే ఎన్నికలివి: ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు వచ్చే ఐదేళ్లలో భారత్‌ను పెద్ద ప్రపంచ శక్తిగా మార్చగలవని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అంతర్జాతీయంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా బలమైన, స్థిరమైన ప్రభుత్వం అవసరమని మోడీ అన్నారు. శుక్రవారం మధ్యప్రదేశ్‌లోని దామోహ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన ఆయన.. అనేక దశాబ్దాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దేశ రక్షణ వ్యవస్థను బలహీనపరిచింది. దేశ రక్షణ రంగాన్ని నిర్వీర్యం చేసిందని ఆరోపణలు చేశారు. రక్షణ రంగంలో దేశ స్వావలంబన కోసం బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోంది. అనేక దేశాలకు ఆయుధాలను భారత్ సరఫరా చేస్తోంది. ఫిలిప్పీన్స్‌కు బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూజ్ క్షిపణులను ఎగుమతి చేస్తోందని మోడీ అన్నారు. ఇదే సందర్భంలో పాకిస్తాన్‌ను ప్రస్తావించిన ప్రధాని, ఉగ్రవాదులను సరఫరా చేసే పొరుగుదేశం, ఈరోజు పిండి కోసం పాట్లు పడుతోందన్నారు. పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దాదాపు 80 కోట్ల మంది లబ్ధిదారులకు కేంద్రం ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించిందని పేర్కొన్నారు. ఫ్రాన్స్ తయారు చేసిన రఫేస్ యుద్ధ విమానాలు భారత్‌కు రావడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని విమర్శించారు. ఇక, రామజన్మభూమి, బాబ్రీ మసీదు కేసులో కక్షిదారుగా ఉన్న ఇక్బాల్ అన్సారీని ప్రధాని మోడీ ప్రశంసించారు. అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమ ఆహ్వానాన్ని ఆయన అంగీకరించడం సంతోషకరమని మోడీ వెల్లడించారు.

Next Story