ప్రపంచంలోనే అతి భారీ భూకంపాలు ఇవే.. ప్రాణాలు కొల్పోయిన వేలాది మంది

by Yella Dhawani Reddy |

రష్యా (Russia) తూర్పు తీరంలోని కంచట్కా ద్వీపకల్పంలో జులై 30 ఉదయం భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే.

ప్రపంచంలోనే అతి భారీ భూకంపాలు ఇవే.. ప్రాణాలు కొల్పోయిన వేలాది మంది
X

దిశ, వెబ్ డెస్క్: రష్యా (Russia) తూర్పు తీరంలోని కంచట్కా ద్వీపకల్పంలో జులై 30 ఉదయం భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 8.8గా నమోదైంది. సముద్రం లోపల భూప్రకంపనాలు చోటుచేసుకోవటంతో రష్యా, జపాన్‌తో పాటు ఉత్తర పసిఫిక్‌లోని పలు తీర ప్రాంతాల్లో సునామీ (Tsunami) హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు, 2011 తర్వాత పసిఫిక్‌ ప్రాంతంలో అత్యంత భారీ భూకంపం రావటం ఇదే తొలిసారి.

ప్రపంచాన్ని వణికించిన భూకంపాలు ఇవే..

* ప్రపంచంలో తొలిసారి 1952లో అత్యంత భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై దీని తీవ్రత 9గా నమోదైంది. రష్యాలోని కమ్చట్కా క్రై ప్రాంతంలో ఇది చోటుచేసుకుంది. హవాయిని తాకిన ప్రకంపనలు భారీ సునామీ సైతం సృష్టించాయి. ఈ భూకంపంలో 1 మిలియన్‌ డాలర్ల ఆస్తి నష్టం చోటుచేసుకుంది.

* వాల్డివియా భూకంపం లేదా గ్రేట్‌ చిలీ భూకంపం.. ఇప్పటివరకు ప్రపంచంలో సంభవించిన అతి పెద్ద భూకంపంగా ఉంది. 1960లో చిలీలో చోటుచేసుకున్న ఈ భూకంపం తీవ్రత రికార్డు స్కేలుపై 9.5గా నమోదయింది. ఈ భూకంపం ధాటికి దాదాపు 1,655 మంది ప్రాణాలు కోల్పోగా.. 20 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.

* ఆ తర్వాత 1964లో అమెరికాలోని అలస్కాలో 9.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తర్వాత వచ్చిన సునామీ కారణంగా దాదాపు 130 మందికి పైగా ప్రజలు మరణించారు. 2.3 బిలియన్‌ డాలర్ల మేర ఆస్తినష్టం జరిగింది.

* ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో 2004లో రికార్టు స్కేలుపై 9.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. సుమత్రా-అండమాన్‌ దీవుల్లో సముద్రం లోపల భూ ప్రకంపనలు రావటంతో భారీ సునామీ సైతం ఏర్పడింది. ఈ ప్రకృతి వైపరీత్యంలో 2,80,000 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోగా.. దక్షిణాసియా, తూర్పు ఆఫ్రికా ప్రాంతంలో 1.1 మిలియన్ల మంది నిరాశ్రయులు అయ్యారు.

* 2011లో జపాన్‌లోని తోహోకు ప్రాంతంలో 9.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీనిని 'గ్రేట్‌ తోహోకు' భూకంపంగా నామకరణం చేశారు. ఈ భూకంపం కారణంగా సునామీ రావటంతో 15,000 మందికి పైగా మరణించగా.. 1,30,000 మంది నిరాశ్రయులయ్యారు.

* ఇక 2010లో చిలీలోని బయోబియోలో మరోసారి భూకంపం సంభవించింది. దీని తీవ్రత 8.8గా నమోదవ్వగా.. క్విరిహ్యూ నగరం సమీపంలో చోటుచేసుకున్న ఈ భూకంపం కారణంగా 523 మంది ప్రాణాలను తీశాయి. 3.7 లక్షల ఇళ్లను ధ్వంసం చేశాయి.

* 1906లో ఈక్వెడార్‌-కొలంబియాలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టరు స్కేలుపై 8.8 నమోదు కాగా, ఈ ప్రకంపనాలు బలమైన సునామీకి దారితీశాయి. ఈ ప్రకృతి వైపరీత్యం కారణంగా 1500 మంది ప్రాణాలు కోల్పోయారు.

* అలస్కాలోని ర్యాట్‌ దీవులకు సమీపంలో 1965లో 8.7 తీవ్రతతో భూప్రకంపనాలు చోటుచేసుకున్నాయి. దీని కారణంగా 35 అడుగుల ఎత్తైన సునామీ అలలు విరుచుకుపడ్డాయి.

* భారత్‌లోని అరుణాచల్‌‌ప్రదేశ్‌లో 1950లో 8.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 780 మంది మరణించారు.

* 2012లో ఇండోనేషియాలోని ఉత్తర సమత్రా తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై 8.6 తీవత్రతో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

Next Story