‘ఫేక్’ కాల్స్, ఎస్ఎంఎస్‌లకు చెక్..! ట్రాయ్ కొత్త నిబంధనలు

by Disha Web Desk 13 |
‘ఫేక్’ కాల్స్, ఎస్ఎంఎస్‌లకు చెక్..! ట్రాయ్ కొత్త నిబంధనలు
X

న్యూఢిల్లీ: ‘లోన్ కావాలా.. ప్లాట్ కొంటారా.. బంపర్ లాటరీ తగిలింది..’ అంటూ పొద్దున లేచినప్పటి నుంచి ఫేక్ కాల్స్, ప్రమోషన్ కాల్స్, ఎస్ఎంఎస్ లతో చికాకు పడుతున్నారా..? ఇలాంటి నకిలీ కాల్స్ కు మే ఒకటో తేదీ నుంచి విముక్తి లభించనుంది. ఫేక్ కాల్స్‌ను నియంత్రించేందుకు స్పామ్ ఫిల్టర్‌ను ఏర్పాటు చేసుకోవాలని టెలికాం సర్వీసు ప్రొవైడర్లను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఆదేశించింది.

దీంతో స్పామ్ కాల్స్ నియంత్రణకు అవసరమైన టెక్నాలజీని టెలికాం సర్వీసు ప్రొవైడర్లు సమకూర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఫేక్ కాల్స్, ఎస్ఎంఎస్ ల నిరోధానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) స్పామ్ ఫిల్టర్లను అందుబాటులోకి తెస్తున్నట్లు ఎయిర్ టెల్ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. దేశంలో అతిపెద్ద సర్వీసు ప్రొవైడర్ అయిన రిలయన్స్ జియో సైతం ఏఐ స్పామ్ ఫిల్టర్లను ఇన్ స్టాల్ చేసే పనిలో నిమగ్నమైంది. దీంతో ఏఐ ఫిల్టర్ల అప్లికేషన్ భారత్ లో మే ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానుంది.

10 అంకెల మొబైల్ కు ప్రమోషన్ కాల్స్ బ్లాక్..

10 అంకెల మొబైల్ నెంబర్లకు ప్రమోషన్, మార్కెటింగ్ కాల్స్ చేయకుండా బ్లాక్ చేయాలని ట్రాయ్ సూచించింది. ట్రాయ్ త్వరలో కాలర్ ఐడీ ఫీచర్‌ను తీసుకొచ్చే ప్లాన్ కూడా చేస్తోంది. దీంతో కాల్ చేసిన వారి పేరు, ఫొటో మన మొబైల్ లో కనిపిస్తుంది. ఈ ఫీచర్ కోసం ట్రూ కాలర్‌తో జియో సర్వీసు, ఎయిర్ టెల్ చర్చలు జరుపుతున్నాయి. అయితే.. ఈ ఫీచర్‌తో కంపెనీల గోప్యతకు భంగం కలుగుతుందని, ప్రజల ప్రైవసీ దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Next Story