ఎన్డీయే 400 సీట్లు గెలిస్తే మథుర, వారణాసిలో ఆలయాలు: అసోం సీఎం బిస్వ శర్మ

by samatah |
ఎన్డీయే 400 సీట్లు గెలిస్తే మథుర, వారణాసిలో ఆలయాలు: అసోం సీఎం బిస్వ శర్మ
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 400 సీట్లు గెలిస్తే మథురలో శ్రీకృష్ణుడి జన్మస్థలం, వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో ఆలయాలను నిర్మిస్తామని అసోం సీఎం హిమంత బిస్వశర్మ అన్నారు. జార్ఖండ్‌లోని బొకారోలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన ప్రసంగించారు. 2019లో 300 సీట్లు సాధించి అయోధ్యలో రామమందిరం నిర్మించామని గుర్తు చేశారు. మరోసారి 400 సీట్లు గెలిస్తే ఈ ఆలయాలను నిర్మిస్తామని వెల్లడించారు. దేశంలో బీజేపీ చేయాల్సిన పని ఇంకా అయిపోలేదని కొన్ని పనులు అసంపూర్తిగానే ఉన్నాయని తెలిపారు. మోడీ మూడోసారి గెలిస్తే ఆ పనులన్నీ పూర్తవుతాయని స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) సైతం భారత్‌లో విలీనం చేస్తామన్నారు. భారత్‌ను ప్రపంచంలోనే విశ్వ గురువుగా మార్చేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్, జేఎంఎంల పాలనలో ఉన్న జార్ఖండ్ అభివృద్ధి చెందలేక పోతుందని విమర్శించారు.

Next Story