టేక్ ఆఫ్ సమయంలో టెక్నికల్ లోపం.. విమానంలోనే ఉన్న ఎంపీ డింపుల్ యాదవ్

by Malleboina Mahesh |

లక్నో నుండి ఢిల్లీకు బయలుదేరిన ఇండిగో విమానం 6E 2111, టేక్ ఆఫ్ సమయంలో గంభీర ఇంజిన్ లోపాన్ని ఎదుర్కొంది.

టేక్ ఆఫ్ సమయంలో టెక్నికల్ లోపం.. విమానంలోనే ఉన్న ఎంపీ డింపుల్ యాదవ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో విమానాల్లో సాంకేతిక సమస్యలు (Technical problems in aircraft) ఎక్కవగా తలెత్తుతున్నాయి. దీంతో కొన్ని విమానాలు గమ్యస్థానాలను చేరకముందే నిలిచిపోతున్నాయి. మరికొన్ని విమానాశ్రయం నుంచి గాల్లోకి ఎగరక ముందే ఆగిపోతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే శనివారం చోటు చేసుకుంది. లక్నో నుండి ఢిల్లీకు బయలుదేరిన ఇండిగో విమానం (Indigo flight) 6E 2111, టేక్ ఆఫ్ సమయంలో గంభీర ఇంజిన్ లోపాన్ని ఎదుర్కొంది. 151 మంది ప్రయాణికులతో పాటు సమాజ్‌వాది పార్టీ ఎంపీ, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ (Dimple Yadav) కూడా ఉన్నారు. గాల్లోకి ఎగిరేందుకు సిద్ధమైన విమానం రన్ వే పై పరిగెత్తుతున్న సమయంలో ఒక్కసారిగా సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆ విమానం టేక్ ఆఫ్ రద్దు చేయాల్సి వచ్చింది.

ఇంజిన్ సరైన శక్తిని ఉత్పత్తి చేయకపోవడం Pilot గమనించి, ఎమర్జెన్సీ బ్రేక్‌లను (Emergency brakes) ఉపయోగించి విమానాన్ని రన్‌వే చివరి ప్రాంతానికి చేరకముందే నిలిపివేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ షాకింగ్ ఘటన చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకోగా.. ఆ సమయంలో విమానంలో ఉన్న ఎంపీ డింపుల్ యాదవ్ తో పాటు ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే ఇంజనీర్లు గంటల తరబడి విమానాన్ని పరిశీలించినప్పటికీ, సరిగ్గా ఎటువంటి సాంకేతిక లోపం ఏర్పడిందో వెంటనే గుర్తించలేకపోయారు. టేక్ ఆఫ్ రద్దైన తర్వాత, డింపుల్ యాదవ్ సహా అందరూ ప్రయాణికులను సురక్షితంగా మరొక ఢిల్లీ వైపు వెళ్లే విమానం లోకి పంపించారు. కాగా ఇండిగో విమాన సంస్థ ఈ వైఫల్యానికి క్షమాపణ తెలిపింది.

Next Story