కోర్టులు చట్టాలు చేయలేవు.. సుప్రీం కోర్టు

by Dishafeatures2 |
కోర్టులు చట్టాలు చేయలేవు.. సుప్రీం కోర్టు
X

న్యూఢిల్లీ: పురుషులు, మహిళల కనీస వివాహ వయస్సు ఓకేలా ఉండేలా ఆదేశించాలన్న పిటిషనర్ అభ్యర్థనను సుప్రీం కోర్టు సోమవారం తిరస్కరించింది. కొన్ని అంశాలు పార్లమెంట్‌కు రిజర్వ్ చేయబడ్డాయని, కోర్టులు చట్టాలు చేయలేవని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. చట్టాలు చేయాలని పార్లమెంట్‌ను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించలేదని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం చెప్పింది. 'మేము పార్లమెంట్‌ను వ్యతిరేకించగలం. అంతేకాని చట్టాలు చేయలేం. రాజ్యాంగానికి మేము మాత్రమే ప్రత్యేక సంరక్షకులమని భావించకూడదు. పార్లమెంట్ కూడా సంరక్షుకులే' అని పిటిషనర్ అభ్యర్థనను తిరస్కరిస్తూ సుప్రీం కోర్టు చెప్పింది.

చట్టం ప్రకారం పురుషులు, మహిళలకు సమాన వయసు ఉండాలని కోరుతూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. భారత్‌‌లో చట్టం ప్రకారం పురుషుల వివాహ వయస్సు 21 సంవత్సరాలు, మహిళల వయసు 18. 'పురుషులతో సమానంగా మహిళల వివాహ వయసును కూడా 21కి పెంచాలని పిటిషనర్ కోరుతున్నారు. పిటిషనర్ చట్ట సవరణను ఆశిస్తున్నారు. పార్లమెంట్‌ను మేము శాసించలేం. కనుకనే ఈ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నాం' అని జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పరిడివాలాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.




Next Story

Most Viewed