Supreme Court: మా కుమారుడికి మరణం ప్రసాదించండి.. ‘కారుణ్య మరణం’ కేసులో తీర్పు రిజర్వ్

by Prasad Jukanti |

బతకాలో.. చావాలో.. చెప్పడానికి మనమెవరం అని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Supreme Court: మా కుమారుడికి మరణం ప్రసాదించండి.. ‘కారుణ్య మరణం’ కేసులో తీర్పు రిజర్వ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కోమాలో ఉండి జీవచ్ఛవంలా మారిన తన కుమారుడికి కారుణ్య మరణం (Compassionate Death) ప్రసాదించాలంటూ ఓ వ్యక్తి తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘మేం మనుషులమే.. ఎవరు బతికి ఉండాలో? ఎవరు చనిపోవాలో.. నిర్ణయించేందుకు మనం ఎవరం?’ అని జస్టిస్ జేబీ పార్దివాలా (Justice JB Pardiwala), జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో (Justice KV Viswanathan) కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసులో కారుణ్య మరణం అనే పదాన్ని తాము ఉపయోగించలేమని, నిత్యం ఎన్నో కేసులను విచారిస్తామని, కానీ ఇది చాలా సున్నితమైన అంశం అని తీర్పును రిజర్వ్ చేసింది.

వైద్యనివేదికలును పరిశీలించి..

ఢిల్లీకి చెందిన 32 ఏళ్ల హరీశ్ రాణా 2013 ఆగస్టు 20న చండీగఢ్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి కిందపడిపోయాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన హరీశ్ కోమాలోకి పోయాడు. పలు ప్రముఖ ఆస్పత్రుల్లో వైద్యం అందించినా ఎలాంటి పురోగతి లేకుండా జీవచ్ఛవంలా మారిపోయాడు. కోమాలో ఉన్న హరీశ్‍ను ఇన్నాళ్లు తమ తల్లిదండ్రులు ఇంట్లోనే చూసుకున్నారు. అయితే కుమారుడి చికిత్స విషయంలో ఆర్థికంగా, మానసికంగా చితికిపోయిన తల్లిదండ్రులు ఇక కారుణ్య మరణానికి అనుమతించాలని 2024లో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్‌ను తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా తొలుత నిరాశే ఎదురైనా.. హరీశ్ కోలుకునే అవకాశం లేదని వైద్యులు మరోసారి నివేదిక ఇవ్వడంతో అతడి కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వైద్యనివేదికలను పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానం.. కేసు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ఈ నెల 13న అతడి తల్లిదండ్రులతో మాట్లాడిన ధర్మాసనం.. వారి అభిప్రాయాలను తీసుకుంది. తాజాగా ఇవాళ ఈ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసింది.

Next Story