- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Supreme Court: హైవేలపై పశువుల సంచారం.. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
జాతీయ రహదారులపై పశువుల సంచారం వల్ల జరుగుతున్న ప్రమాదాలను కోట్ చేస్తూ.. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

దిశ, వెబ్డెస్క్: జాతీయ రహదారులపై అకస్మాత్తుగా పశువులు అడ్డు రావడం వల్ల జరుగుతున్న ఘోర ప్రమాదాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) ఆగ్రహం వ్యక్తం చేసింది.హైవేలపై పశువుల చొరబాటును నివారించేలా శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ (Surya Kant), జస్టిస్ కేవీ విశ్వనాథన్ (Viswanathan) ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ మేరకు హైవేలపై జరగుతున్న ప్రమాదాపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI)కు నోటీసులు జారీ చేసింది.
పిటిషనర్ ఆవేదన..
కేసు విచారణ సందర్భంగా పిటిషనర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రహదారులపైకి పశువులు రావడం వల్ల వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారని, ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతోందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాహనదారులు భారీగా టోల్ పన్ను చెల్లిస్తున్నప్పటికీ, వారికి కనీస భద్రత కరువైందని పేర్కొన్నారు. రహదారులకు ఇరువైపులా పటిష్టమైన కంచె (Fencing) ఏర్పాటు చేయాలని తెలిపారు. పశువులను హైవేలపైకి వదిలే యజమానులపై కఠిన చర్యలు తీసుకునేలా నిబంధనలు రూపొందించాలని అన్నారు. హైవేల నిర్వహణ సంస్థలు (NHAI) పశువుల చొరబాటును అడ్డుకోవడంలో విఫలమైతే వారిని బాధ్యులను చేయాలని పిటిషనర్ కోరారు.
ఇరు పక్షాల వాదనలు విన్న సీజేఐ ధర్మాసనం కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ తన స్పందనను తెలియజేయాలని ఆదేశించింది. పశువుల కారణంగా జరుగుతున్న ప్రమాదాల్లో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతుండటంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేస్తూ విచారణను వాయిదా వేసింది.






