కోటాలో ఆగని ఆత్మహత్యలు..మరో నీట్ విద్యార్థి సూసైడ్

by Dishanational2 |
కోటాలో ఆగని ఆత్మహత్యలు..మరో నీట్ విద్యార్థి సూసైడ్
X

దిశ, నేషనల్ బ్యూరో: రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్ధుల ఆత్మహత్యలు ఆగడం లేదు. సోమవారం హర్యానాలోని రోహ్ తక్‌కు చెందిన సుమిత్ అనే విద్యార్థి సూసైడ్ చేసుకున్న ఘటన మరువక ముందే మంగళవారం మరో నీట్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కోటా నగరానికి 400 కిలోమీటర్ల దూరంలో ఉండే ధోల్ పూర్‌కు చెందిన భరత్ (20) కోటాలో ఉంటూ నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కి ప్రిపేర్ అవుతున్నాడు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం తను నివాసముండే గదిలోనే ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు.

భరత్‌తో పాటు నివాసముండే మరో స్నేహితుడు బయటకు వెళ్లి వచ్చే సరికి గదిలో ఆత్మహత్య చేసుకుని కనపడ్డాడు. ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ ఏడాది కోటాలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 10కి చేరింది. విద్యార్థుల బలవన్మరణాల నేపథ్యంలో కోటాలోని హాస్టల్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. హాస్టల్ ఫ్యాన్‌లలో స్ప్రింగ్ కాయిల్స్‌ను అమర్చడంపై దృష్టి సారించినట్టు సమాచారం. ఇది అమర్చితే 20 కిలోల కంటే ఎక్కువ బరువున్న వస్తువును వేలాడదీసినప్పుడు దానికి సంబంధించిన సైరన్ వినబడుతుంది. దీని ద్వారా ఆత్మహత్యలను అపొచ్చని భావిస్తోంది.

Next Story