చెన్నై సిటీలో విచిత్ర పరిణామం.. సబ్‌వేలో చిక్కుకుపోయిన మెట్రో రైలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-02 03:22:48  IST  )

చెన్నై (Chennai)లో విచిత్ర పరిణామం చోటుచేసుకుంది.

చెన్నై సిటీలో విచిత్ర పరిణామం.. సబ్‌వేలో చిక్కుకుపోయిన మెట్రో రైలు
X

దిశ, వెబ్‌డెస్క్: చెన్నై (Chennai)లో విచిత్ర పరిణామం చోటుచేసుకుంది. ఉదయం వింకోనగర్ డిపో (Vinco Nagar Depot) నుంచి చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (Chennai International Airport) వరకు నడుస్తున్న బ్లూ లైన్ మెట్రో రైలులో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో సెంట్రల్ మెట్రో, హైకోర్టు స్టేషన్ల మధ్య టన్నెల్‌లో రైలు అకస్మాత్తుగా నిలిచిపోయింది. రైలులో విద్యుత్ పూర్తిగా తెగిపోవడంతో ఏసీ, లైట్లు, వెంటిలేషన్ ఏమీ పని చేయలేదు. సుమారు 10 నుంచి 15 నిమిషాల పాటు మెట్రో రైలులో చిమ్మచీకటితో పాటు గాలి ఆడకపోవడంతో ప్రయాణికులు ఊపిరాడక తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

అనంతరం ప్రయాణికులకు మెట్రో అధికారులు మైక్‌లో కీలక ప్రకటన చేశారు. ప్రయాణికులంతా వెంటనే రైలు దిగి హైకోర్టు స్టేషన్ వరకు టన్నెల్‌లోని నడక మార్గంలో నడిచి వెళ్లాలని.. కలిగిన అసౌకర్యానికి విచారిస్తున్నామని పేర్కొన్నారు. దీంతో ప్రయాణికులు ఒక్కొక్కరుగా లైన్‌లో నిల్చుని, గోడకు అడ్డంగా ఉన్న హ్యాండ్ రైల్ పట్టుకుని ట్రాక్ పక్కనున్న ఇరుకైన మార్గంలో గుండె నడిచి టన్నెల్ నుంచి బయటకు వచ్చారు. ట్రాక్షన్ పవర్ వైఫల్యంతో మెట్రో రైలు నిలిచిందని టెక్నికల్ టీమ్ వెల్లడించింది. అనంతరం చెన్నై మెట్రో రైల్ అధికారులు కొద్ది గంటల్లోనే సమస్యను సరిచేసి బ్లూ లైన్, గ్రీన్ లైన్ రైళ్లు రాకపోకలను పునరుద్ధరించినట్లుగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా ప్రకటించారు. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదని, సర్వీసులు ఇప్పుడు పూర్తిగా సాధారణ స్థితికి చేరుకున్నాయని ప్రయాణికులు తమ అనుభవాన్ని నెట్టింట్లో పంచుకున్నారు.

Next Story