'ఎన్నికల తర్వాత విదేశీ పర్యటనలకు సిద్ధమవుతున్నారు': ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ విమర్శలు

by Gopi |
ఎన్నికల తర్వాత విదేశీ పర్యటనలకు సిద్ధమవుతున్నారు: ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ప్రతిపక్షాలపై విమర్శల ధాటి పెంచారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగింపునకు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలపై ప్రధాని మోడీ వ్యంగ్యాస్త్రాలు పెంచారు. ఎన్నికల తర్వాత కొందరు విదేశీ పర్యటన కోసం టికెట్లను బుక్ చేసుకున్నారని, ఈ విషయం తనకు ఎవరో చెప్పారని రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్‌లను ఉద్దేశించి మాట్లాడారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసిన ప్రసంగంలో.. వారిద్దరి పేర్లను ప్రస్తావించకుండానే రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్‌లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. 'కాంగ్రెస్, ఎస్పీ పార్టీల కలలు చెదిరిపోయాయి. జూన్ 4 తర్వాత ఓటమికి ఎవరిని బాధ్యులను చేయాలనే దానిపై ప్రణాళిక వేస్తున్నారు. వారి విదేశీ పర్యటన టిక్కెట్లు కూడా బుక్ అయ్యాయని ఎవరో నాకు సమాచారం ఇచ్చారు' అని మోడీ అన్నారు. యూపీలో కాంగ్రెస్‌కు ఉనికి లేదు. కాంగ్రెస్ మొత్తం కుటుంబ గౌరవాన్ని కాపాడటంలో నిమగ్నమై ఉంది. ప్రతీ ఎన్నికల్లో ఆ రెండు కుటుంబాల వారసులు భాగస్వామ్యం కలిగి ఉంటారు. రెండు పార్టీలూ అవినీతి కోసం రాజకీయాల్లో ఉన్నాయని, ఓటు బ్యాంకును సంతృప్తి పరచడానికి ఏదైనా చేస్తాయని ఆరోపణలు చేశారు. ఆ పార్టీలు నేరస్తులను, మాఫియాను ప్రోత్సహిస్తాయని, కాంగ్రెస్, ఎస్పీ ఉగ్రవాదుల విషయంలో సానుభూతిని కలిగి ఉంటాయని మోడీ పేర్కొన్నారు.

ఇదే సమయంలో గ్యాంగ్‌స్టర్, ఇటీవల మరణించిన ముఖ్తార్ అన్సారీ ఇంటికి వెళ్లి అఖిలేష్ యాదవ్ వారి కుటుంబాన్ని పరామర్శించడంపై మోడి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాఫియాపై ఎస్పీకి ప్రేమ తగ్గలేదు. ఎస్పీ చీఫ్ మాఫియా సమాధిపై ఫాతియా చదువుతున్నారని ఎద్దేవా చేశారు. ఇదివరకు పాకిస్తాన్ భారత్‌పై దాడి చేస్తుండేది, కాంగ్రెస్ వారికి క్లీన్‌చిట్ ఇచ్చేది. కానీ వాళ్లు కాషాయ ఉగ్రవాదం అని తప్పుడు ప్రచారం చేసేవారు. యూపీలోనూ ఎస్పీ ప్రభుత్వం గ్యాంగ్‌స్టర్‌లకు ఆతిథ్యం ఇస్తే, వారు సీఎంను కలిసేందుకు హెలికాప్టర్లలో పర్యటించేవారి విమర్శించారు.

Next Story

Most Viewed