ఈడీ, మోడీలకు భయపడి బీజేపీలో చేరుతున్నారు: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే

by Dishanational1 |
ఈడీ, మోడీలకు భయపడి బీజేపీలో చేరుతున్నారు: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ లబ్ది పొంది మంత్రులు, ముఖ్యమంత్రులైన కొందరు నేతలు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ప్రధాని నరేంద్ర మోడీలకు భయపడి బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గె అన్నారు. తమ పార్టీ నుంచి ఎన్నికైన కొంతమందికి సిద్ధాంతాలపై బలమైన నమ్మకం లేకపోవడం వల్లే చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయిందని అన్నారు. మంగళవారం సొంత జిల్లా బీదర్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న కాంగ్రెస్ చీఫ్ ఖర్గె, 'తమ పార్టీ ఎన్నికైన అనేక రాష్ట్రాల్లో బీజేపీ మా ప్రభుత్వాన్ని తొలగించింది. దీనికి కారణం మా పార్టీలో ఎన్నికైన నేతలకు సిద్ధాంతాలపై బలమైన నమ్మకం లేకపోవడమే. గతంలో కర్ణాటకలో, ఇటీవల మధ్యప్రదేశ్, మణిపూర్, గోవాలలో ప్రభుత్వాలను కోల్పోయామని' ఖర్గె అన్నారు. కొందరు డబ్బు వ్యామోహం,కొందరు అధికార కాంక్షతో, మరికొందరు పార్టీలోని వారితో విభేదాల కారణంగా కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి వెళ్లారని తెలిపారు. ఈ క్రమంలోనే ఇటీవల రాజ్యసభ ఛైర్మన్ కార్యాలయంలో ప్రధాని మోడీతో జరిగిన సంభాషణలో, మీ పార్టీలోకి ఇంకా ఎంతమందిని తీసుకుంటారని అడిగానని ఖర్గె చెప్పారు. 'నేతలు బీజేపీ వైపునకు వస్తుంటే తానేం చేయగలనని' మోడీ అన్నారు. మీ దగ్గర ఈడీ, ఆదాయపు పన్ను, సెంట్రల్ విజిలెన్స్ ఉన్నాయి. అందుకే బీజేపీలోకి భయంతో చేరుతున్నారని ఖర్గే ఆరోపించారు. ఇటీవల కాంగ్రెస్ నేతలు ఇతర పార్టీలకు, ముఖ్యంగా బీజేపీలో చేరుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేశారు.

Next Story

Most Viewed