ఖర్గే, జైరాం రమేశ్‌లకు షాక్: లీగల్ నోటీసులు జారీ చేసిన నితిన్ గడ్కరీ

by Dishanational2 |
ఖర్గే, జైరాం రమేశ్‌లకు షాక్: లీగల్ నోటీసులు జారీ చేసిన నితిన్ గడ్కరీ
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌లకు షాక్ తగిలింది. తనను అగౌరవపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వారిద్దరికీ లీగల్ నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లో తనపై పెట్టిన పోస్టులు ఎక్స్ నుంచి తొలగించాలని, మూడు రోజుల్లోగా రాతపూర్వక క్షమాపణలు చెప్పాలని..లేనిచో తదుపరిగా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. గడ్కరీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగా వీడియో క్లిప్‌ను షేర్ చేశారని గడ్కరీ తరఫు న్యాయవాది బాలెందు శేఖర్ తెలిపారు. ఉద్దేశ పూర్వకంగానే గడ్కరీపై తప్పుడు ప్రచారం చేశారని పేర్కొన్నారు. నోటీసులకు స్పందిచకుంటే చర్యలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.

వీడియోలో ఏముంది..

నితిన్ గడ్కరీ ఇటీవల ది లలంటాప్ అనే చానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో నుంచి ఓ 19 సెకన్ల వీడియోను కాంగ్రెస్ షేర్ చేసింది. గ్రామాలు, పేదలు, రైతులు, కూలీలు సంతృప్తి కరంగా లేరని వీడియోలో గడ్కరీ వ్యాఖ్యానించారు. అలాగే గ్రామాల్లో తాగునీరు, మంచి ఆస్పత్రులు, పాఠశాలలు, సరైన రోడ్లు కూడా లేవని చెప్పారు. దీనిని కాంగ్రెస్ షేర్ చేసింది. అయితే మొత్తం ఇంటర్వ్యూను వదిలేసి కేవలం రెండు మాటలనే షేర్ చేయడం సరికాదని గడ్కరీ ఆరోపించారు. ఈ వీడియో తన పరువుకు భంగం కలిగించేలా ఉందని, అంతేగాక బీజేపీలో కలకలం రేపేందుకు ప్రయత్నించారని నోటీసుల్లో పేర్కొన్నారు.



Next Story

Most Viewed