శివసేన(యూబీటీ) తొలి జాబితా రిలీజ్: కాంగ్రెస్ నేతల అసంతృప్తి

by Dishanational2 |
శివసేన(యూబీటీ) తొలి జాబితా రిలీజ్: కాంగ్రెస్ నేతల అసంతృప్తి
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికలకు గాను 17మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను శివసేన(యూబీటీ) బుధవారం రిలీజ్ చేసింది. పార్టీ నేత సంజయ్ రౌత్ ఈ లిస్టును విడుదల చేశారు. 17 పేర్లలో, 11 మందిని పార్టీ అధినేత ఉద్ధవ్ థాక్రే గత నెలలో ఆయా లోక్‌సభ నియోజకవర్గాల పర్యటన సందర్భంగా ఇప్పటికే ప్రకటించారు. ముంబై సౌత్ సెంట్రల్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి అనిల్ దేశాయ్‌ పోటీ చేయనున్నారు. అలాగే ముంబై సౌత్ నియోజకవర్గం నుంచి అరవింద్ సావంత్, ముంబై నార్త్ ఈస్ట్‌లో సంజయ్ పాటిల్, ముంబై నార్త్ వెస్ట్ నియోజకవర్గం నుంచి అమోల్ కీర్తికర్‌లు బరిలోకి దిగనున్నారు. ఇక, బుల్దానా సెగ్మెంట్‌లో నరేంద్ర ఖేడేకర్‌కు పార్టీ టికెట్ కేటాయించింది. ఐదుగురు సిట్టింగ్ ఎంపీలకు టికెట్ ఇచ్చింది.

అయితే ముంబైలోని 6 లోక్‌సభ స్థానాల్లో 4 స్థానాల్లో శివసేన(యూబీటీ) అభ్యర్థులను నిలిపింది. దీంతో ఈ సెగ్మెంట్లలో టిక్కెట్లు ఆశిస్తున్న కాంగ్రెస్ నేతలు ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. వీరంతా అధిష్టానాన్ని కలిసేందుకు ఢిల్లీ వెళ్తున్నట్టు సమాచారం. ముంబై నార్త్-వెస్ట్ టికెట్ కాంగ్రెస్ ఆశించగా ఇక్కడ ఉద్ధవ్ గ్రూప్ అమోల్ కీర్తికర్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. ముంబై సౌత్ కూడా అభ్యర్థిని నిలబెట్టడంతో కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాగా, మహారాష్ట్రంలో ఇండియా కూటమిలో శివసేన(యూబీటీ), ఎన్‌సీపీ(శరద్ చంద్రపవార్)లు భాగస్వామిగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకా సీట్ షేరింగ్ ఖరారు కాలేదు. ఈ నేపథ్యంలోనే అభ్యర్థులను ప్రకటించడం గమనార్హం.రాష్ట్రంలో మొత్తం 48 స్థానాలుండగా..ఐదు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.


Next Story