భారత రాష్ట్రపతికి అవమానం! ఫోటో వైరల్

by Ramesh Naini |   (  Updated:2024-04-03 11:56:22  IST  )

భారత మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారతరత్న పురస్కారం అందజేశారు.

భారత రాష్ట్రపతికి అవమానం! ఫోటో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారతరత్న పురస్కారం అందజేశారు. అద్వానీ అనారోగ్యం కారణంగా రాష్ట్రపతి స్వయంగా ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లి పురస్కారాన్ని అందజేశారు. రాష్ట్రపతితోపాటు ఉపరాష్ట్రపతి జగదీప్‌ దన్‌కడ్‌, ప్రధాని మోడీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు అద్వానీ నివాసానికి వెళ్లిన వారిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్‌గా మారింది. ప్రధాని మోడీ, ఎల్‌కే అద్వానీ కూర్చిలో కూర్చోని ఉన్నారు.

కానీ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిలుచోని ఉన్నారు. అదే సమయంలో దిగిన ఫోటో నెట్టింట వైరల్ అయ్యింది. రాష్ట్రపతి నిలబడితే ప్రధాని కూర్చోవడం ఏమిటని నెటిజన్లు విమర్శిస్తున్నారు. భారతరత్న తీసుకోవడానికి రాలేకపోతే ఎవరినైనా పంపిస్తారు. కానీ రాష్ట్రపతి వెళ్లి ఇవ్వడం ఏంటి? ఆ పదవిలో బహుజన మహిళ ఉందనే కదా. కాంగ్రెస్, బీజేపీ, ఆప్, టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్.. ఏ ఆధిపత్య పార్టీలైనా, ఓట్ల కోసం బహుజనులకు పదవులు ఇస్తాయి. కానీ బానిసలుగానే చూస్తాయి.. అని ఓ నెటిజన్ విమర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సైతం సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసింది. ‘ఒక పక్క భారతరత్న ప్రధానం మరోపక్క భారత రాష్ట్రపతికి అవమానం’ అని పోస్ట్ చేసింది. ‘ప్రధాని మోడీ గారు, ఆదివాసి అంటే చులకనా? రాష్ట్రపతి పదవి అంటే చులకనా? లేక ప్రజాస్వామ్యం అంటేనే చులకనా? అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.

Next Story