ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్‌.. ఏడుగురు మావోయిస్టులు మృతి

by Gopi |
ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్‌.. ఏడుగురు మావోయిస్టులు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. నారాయణపూర్-బీజాపూర్ జిల్లా సరిహద్దులోని అటవీప్రాంతంలో భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు నక్సలైట్లు మరణించినట్లు పోలీసులు తెలిపారు. పలువురు గాయపడ్డారు. ఘటనాస్థలంలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. గురువారం ఉదయం 11 గంటలకు భద్రతా బలగాలు అడవుల్లో కూంబింగ్ చేపట్టారు. వారికి మావోయిస్టులు తారసపడటంతో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని నారాయణపూర్ పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) ప్రభాత్ కుమార్ చెప్పారు. దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయన్నారు. ఎన్‌కౌంటర్ స్థలం నుంచి మొత్తం ఏడు తుపాకీలను స్వాధీనం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనతో రాష్ట్రంలో భద్రతా దళాలతో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఈ ఏడాది ఇప్పటివరకు 112 మంది నక్సలైట్లు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఏప్రిల్ 30న నారాయణ్‌పూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దులోని అటవీప్రాంతంలో భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మహిళలతో సహా పది మంది నక్సలైట్లు మరణించారు. ఏప్రిల్ 16న, కాంకేర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో భద్రతా దళాలు 29 మంది నక్సలైట్లను హతమార్చాయి.

Next Story

Most Viewed