ఇసుక మాఫియా అరాచకం.. మహిళా ఆఫీసర్‌పై విచక్షణారహితంగా దాడి

by Disha Web Desk 4 |
ఇసుక మాఫియా అరాచకం.. మహిళా ఆఫీసర్‌పై విచక్షణారహితంగా దాడి
X

దిశ, డైనమిక్ బ్యూరో : బీహార్‌లో ఇసుక మాఫియా ముఠా బరి తెగించింది. సోదాలకు వెళ్లిన మహిళా ఇన్‍స్పెక్టర్ సహా మైనింగ్ అధికారులపై ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న వారు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన సోమవారం బీహార్​లోని పట్నా జిల్లా బిహ్టాలో జరిగింది. ఇసుక మాఫియా లారీలలో ఓవర్​ లోడింగ్ చేస్తున్నారని అధికారులకు సమాచారం అందించింది. వెంటనే పట్నా జిల్లా మైనింగ్ విభాగం ప్రధానాధికారి కుమార్ గౌరవ్..ఇతర అధికారులు, సిబ్బందితో కలిసి రంగంలోకి దిగారు.

పోలీసుల అండతో తనిఖీలు చేపట్టారు. రోడ్డు పక్కన లారీలు ఆపి సోదాలు చేస్తుండగా..ఇసుక మాఫియా సభ్యులు అక్కడకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. రాళ్లు, కర్రలతో మైనింగ్ ఆఫీసర్లు, పోలీసులపై దాడికి దిగారు. ప్రాణ భయంతో పోలీసులు సహా ఇతర అధికారులంతా పరుగులు తీశారు. ఈ ఘటనలో కుమార్ గౌరవ్​తో పాటు మహిళా మైనింగ్ ఇన్స్​పెక్టర్లు ఆమ్యా, ఫర్హీన్​, మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటన సమాచారం అందిన పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. మైనింగ్ ఆఫీసర్లపై దాడి చేసిన కేసులో 44 మందిని పోలీసులు అరెస్టు చేసి..3 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు.

50 వాహనాలను సీజ్ చేసినట్టు తెలిపారు. ‘ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని అరెస్టులు జరుగుతాయి. ఈ ఘటన వెనుక ఉన్న మాస్టర్ మైండ్‍ను పోలీసులు త్వరలోనే అరెస్ట్ చేస్తారు’అని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజీవ్ మిశ్రా చెప్పారు. కాగా, ఈ ఘటనపై బీహార్ ప్రభుత్వం దృష్టి సారించింది. దాడికి పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని సీఎం నితీశ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఆర్జేడీ నేత శివానంద్ తివారీ తెలిపారు

Next Story

Most Viewed