జైలు నుంచి సాయిబాబా రిలీజ్: ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన

by Dishanational2 |
జైలు నుంచి సాయిబాబా రిలీజ్: ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన
X

దిశ, నేషనల్ బ్యూరో: మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో జైలులో ఉన్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను బాంబే హైకోర్టు ఇటీవల నిర్దోషిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన గురువారం నాగ్‌పూర్ సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి సెషన్స్ కోర్టు దోషిగా నిర్ధారించి, జీవిత ఖైదు విధించిన తర్వాత సాయిబాబా 2017 నుంచి ఈ జైలులోనే ఉన్నారు. తాజాగా సాయిబాబా పిటిషన్‌ను విచారించిన బాంబే హైకోర్టు..ఆయనపై మోపిన ఆరోపణలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని పేర్కొంటూ జస్టిస్ వినయ్ జోషి, జస్టిస్ వాల్మీకి ఎస్ఏ మెంజెస్‌లతో కూడిన ధర్మాసనం సెషన్ కోర్టు తీర్పును కొట్టివేసింది. అంతేగాక జీవిత ఖైదును సైతం రద్దు చేసింది. ఈ తీర్పుపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకొనే వరకు రూ.50,000 పూచీకత్తుతో నిందితులను బెయి‌ల్‌పై విడుదల చేయొచ్చని తెలిపింది. దీంతో అన్ని ప్రక్రియలు పూర్తి చేసిన అనంతరం సాయిబాబాను జైలు అధికారులు రిలీజ్ చేశారు. ‘నా ఆరోగ్యం చాలా విషమంగా ఉంది. నేను ప్రస్తుతం ఏమీ మాట్లాడలేను. మొదట వైద్య చికిత్స తీసుకోవాలి. అనంతరం అన్ని విషయాలు మాట్లాడతా’ అని సాయిబాబా జైలు నుంచి బయటకు వచ్చాక మీడియాతో చెప్పారు.


Next Story

Most Viewed