పంజాబ్‌లో ఒంటరిగానే పోటీ: అరవింద్ కేజ్రీవాల్

by Dishanational2 |
పంజాబ్‌లో ఒంటరిగానే పోటీ: అరవింద్ కేజ్రీవాల్
X

దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్‌లోని మొత్తం13 లోక్‌సభ స్థానాలు, చండీగఢ్ లోని ఒక స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని ఆ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. త్వరలోనే ఆయా స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులను ఖరారు చేస్తామని తెలిపారు. శనివారం ఆయన ఓ కార్యక్రమంలో భాగంగా మాట్లాడారు. పంజాబ్‌లో ఇండియా కూటమితో పొత్తు ఉండబోదని తేల్చి చెప్పారు. ‘రెండేళ్ల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ ఆప్ ను ఆశీర్వదించింది. రానున్న పార్లమెంటు ఎన్నికల్లోనూ సత్తా చాటాలి’ అని తెలిపారు. 14 స్థానాల్లోనూ ఆప్ అభ్యర్థులను గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సైతం రాష్ట్రంలో ఆప్ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్‌లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ చేసిన ప్రకటనతో ఇండియా కూటమి ఆందోళనలో పడింది. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు గోవా, హర్యానా, గుజరాత్‌లలోని లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను నిర్ణయించేందుకు ఫిబ్రవరి 13న ఆప్ సమావేశాన్ని నిర్వహించనుంది.

‘ఇండియా’ పతనమవుతున్నది: బీజేపీ

కేజ్రీవాల్ ప్రకటనపై బీజేపీ స్పందించింది. ఇండియా కూటమి నిర్మాణం నాసిరకంగా ఉందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనవాలా అన్నారు. కూటమికి ఒక ఎజెండా గానీ, సరైన కార్యాచరణ గానీ లేదని ఆరోపించారు. అంతా గందర గోళంగా ఉందని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ జోడో న్యాయ్ యాత్ర సైతం విచిత్రంగా ఉందన్నారు.



Next Story

Most Viewed