RSS Vs Congress.. మరింత ముదురుతున్న వివాదం

by Prasad Jukanti |   (  Updated:2026-06-24 13:40:44  IST  )

ఆర్ఎస్ఎస్ చట్టబద్ధ హోదా, ఆర్థిక నిర్వహణ, సంస్థాగత నిర్మాణంపై కర్ణాటక కాంగ్రెస్ లేవనెత్తిన అంశం జాతీయ రాచకీయాల్లో హాట్ టాపిక్‍గా మారింది.

RSS Vs Congress.. మరింత ముదురుతున్న వివాదం
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజకీయాల్లో ఆర్ఎస్ఎస్ చట్టబద్ధత మరోసారి చర్చనీయాశంగా మారింది. కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే చేసిన ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిక్‍ అవుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ వర్సెస్ ఆర్ఎస్ఎస్ మధ్య సైద్ధాంతిక పోరాటం సాగుతున్న వేళ రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రియాంక్ ఖర్గే లేవనెత్తిన అంశం ఎలాంటి పరిణామాలకు దారి తీయబోతోంది అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) చట్టబద్ధ హోదా, ఆర్థిక నిర్వహణ, సంస్థాగత నిర్మాణం, పన్ను వర్తింపు వివరాలను బహిర్గతం చేయాలంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‍కు ప్రియాంక్ ఖర్గే (Priyank Kharge) ఇటీవల లేఖ రాశాయి. అయితే ఈ అంశంలో ఖర్గే తాజాగా చేసిన వ్యాఖ్యలు సిట్యుయేషన్ ను పీక్స్ కు చేర్చుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

కొత్త డాక్యుమెంట్లు సృష్టించాల్సి వస్తుందేమో:

తాను రాసిన లేఖపై మరోసారి స్పందించిన ప్రియాంక్ ఖర్గే మోహన్ భాగవత్‌కు నేను లేఖ రాసి కేవలం వారం రోజులే అయింది. వారు 100 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన దేశభక్తులు. వారికి సంబంధించిన పత్రాలు ఎక్కడో ఒకచోట ఉండే ఉంటాయని.. నాగపూర్‌లోనో, బెంగళూరులోని కేశవ కృప (ఆర్ఎస్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యాలయం) లోనో లేదా సర్సంఘ్‌చాలక్ నివాసంలోనో ఖచ్చితంగా దాచి ఉంచి ఉంటారు అని వ్యాఖ్యానించారు. 'బహుశా ఆ డాక్యుమెంట్లను ఇప్పుడు కొత్తగా సృష్టించాల్సి (Create) వస్తుందేమో.. అందుకే వారికి కొంచెం సమయం పడుతుండవచ్చు' అంటూ ఎద్దేవా చేశారు. ఆర్ఎస్ఎస్ రిజిస్ట్రేషన్, ఆదాయ వనరులకు సంబంధించి తాను సంధించిన ప్రశ్నలకు సరైన సమాధానాలు రాకుంటే నోటీసులు జారీ చేసి, చట్టప్రకారం విచారణకు పిలుస్తామని ఖర్గే స్పష్టం చేశారు.

మైలేజీ ఎవరికి డ్యామేజీ ఎవరికి?:

బీజేపీకి మాతృసంస్థ అయిన ఆర్ఎస్ఎస్‌ను నేరుగా టార్గెట్ చేయడం ద్వారా కాంగ్రెస్ తన 'సెక్యులర్ మరియు రాజ్యాంగ రక్షణ' లైన్‌ను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తోందా అనే టాక్ వినిపిస్తోంది. ఆర్ఎస్ఎస్ చట్ట పరిధిలోకి రాకుండా పనిచేస్తోందనే చర్చను జాతీయ స్థాయిలో లేవనెత్తడం దీని ముఖ్య ఉద్దేశం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీ గెలుపులో ఆర్ఎస్ఎస్ క్రియాశీల పాత్ర పోషిస్తోంది. అయితే ఈ సంస్థనే కాంగ్రెస్ తమ జాతీయ స్థాయిలో అస్త్రంగా మార్చుకోనుందా అనే టాక్ వినిపిస్తోంది. అయితే ఆర్ఎస్ఎస్ విషయంలో దాడి చేస్తే అది కాంగ్రెస్ కంటే అది బీజేపీకే మేలు చేస్తుందనే వాదన తెరపైకి వస్తోంది. 100 ఏళ్ల చరిత్ర గల ఒక సాంస్కృతిక, సామాజిక సంస్థను కాంగ్రెస్ కావాలనే వేధిస్తోందని, ఇది 'హిందూ సంస్థలపై కాంగ్రెస్ చేస్తున్న దాడి' అని బీజేపీ దేశవ్యాప్తంగా ప్రచారం చేసే అవకాశం లేకపోలేదనే అబిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ (రాహుల్ గాంధీ నేతృత్వంలో) తాము హిందూ వ్యతిరేకం కాదని నిరూపించుకోవడానికి క్షేత్రస్థాయిలో ప్రయత్నిస్తోంది. అయితే, ఆర్ఎస్ఎస్‌పై లీగల్ యాక్షన్, డాక్యుమెంట్ల సృష్టి వంటి తీవ్ర వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు జాతీయ స్థాయిలో 'యాంటీ-హిందూ' ముద్ర పడే ప్రమాదాన్ని పెంచుతాయనే టాక్ వినిపిస్తోంది. ఇది హిందీ హార్ట్‌ల్యాండ్ (ఉత్తర భారతదేశం) లో కాంగ్రెస్‌కు నష్టం చేయవచ్చనే చర్చ జరుగుతోంది. మరి కర్ణాటకలో మొదలైన కొత్త డిబేట్ భవిష్యత్ రాజకీయాలకు ఎలాంటి కేరాఫ్ గా మారబోతోంది అనేది కాలమే సమాధానం చెప్పనుంది.

Next Story