‘ఒకే దేశం, ఒకే జెండా, ఒకే జాతీయ గీతం’.. ఆర్ఎస్ఎస్ అనుబంధ ముస్లిం బాడీ దేశవ్యాప్త ప్రచారం

by Disha Web Desk 17 |
‘ఒకే దేశం, ఒకే జెండా, ఒకే జాతీయ గీతం’.. ఆర్ఎస్ఎస్ అనుబంధ ముస్లిం బాడీ దేశవ్యాప్త ప్రచారం
X

న్యూఢిల్లీ: ఆర్ఎస్ఎస్ అనుబంధ ముస్లిం రాష్ట్రీయ మంచ్ (ఎంఆర్ఎం) ‘ఒకే దేశం, ఒకే జెండా, ఒకే జాతీయ గీతం’ ధీమ్‌తో మైనార్టీ వర్గాలకు చేరువయ్యేందుకు 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు దేశవ్యాప్త ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఈ ప్రచారంలో ‘నిజమైన ముస్లిం.. మంచి పౌరుడు’ అనే సందేశాన్ని వాలంటీర్లు ప్రచారం చేస్తారని ఎంఆర్ఎం ఒక ప్రకటనలో తెలిపింది. జూన్ 8 నుంచి 11వ తేదీ వరకు భోపాల్‌లో ఎంఆర్ఎం వాలంటీర్లు, కార్యకర్తలకు మూడ్రోజుల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వెల్లడించింది.

ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎంఆర్ఎం ప్రధాన పరిపాలకుడు ఇంద్రేష్ కుమార్ ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇంతకుముందు అంటే 2021లో ఉత్తరప్రదేశ్‌లో ఘజియాబాదల్ జిల్లాలో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎంఆర్ఎం ప్రతినిధి షాహిద్ సయీద్ మాట్లాడుతూ.. ‘2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎంఆర్ఎం ‘ఒక దేశం, ఒక జెండా, ఒక జాతీయ గీతం, ఒకే చట్టం’ అనే ఆలోచనను ముస్లిం సమాజంలోకి తీసుకెళ్లడానికి ప్రచారాన్ని ప్రారంభిస్తుంది. నిజమైన ముస్లిం.. మంచి పౌరుడు అనే సందేశాన్ని అందిస్తూ ఎంఆర్ఎం వాలంటీర్లు, కార్యకర్తలు దేశంలోని నలుమూలల ఉన్న మైనారిటీ కమ్యూనిటీకి చేరువవుతారు’ అని చెప్పారు.

రాష్ట్రంలో ముస్లింల జనాబా గణనీయంగా ఉండటంతో శిక్షణా కార్యక్రమానికి భోపాల్‌ను ఎంచుకున్నట్టు సయీద్ చెప్పారు. ‘మధ్యప్రదేశ్‌లో ముస్లిం ఓటు బ్యాంకు బీజేపీకి దూరమవుతోంది. గత ఎన్నికల్లో ఉత్తర, సెంట్రల్ అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. ఈ రెండు నియోజకవర్గాల్లో ముస్లిం జనాభా అధికంగా ఉంది. ఉత్తర భోపాల్ కాంగ్రెస్‌కు కంచుకోటగా మారింది’ అని ఎంఆర్ఎం ప్రతినిధి చెప్పారు.



Next Story

Most Viewed