ఒక్కో ఎమ్మెల్యేకు రూ.25కోట్లు ఆఫర్: బీజేపీపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు

by Dishanational2 |
ఒక్కో ఎమ్మెల్యేకు రూ.25కోట్లు ఆఫర్: బీజేపీపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నించిందని, పార్టీ మారిన వారికి రూ.25 కోట్లు ఇస్తామని ఆఫర్ చేసిందని ఆరోపించారు. ఇప్పటికీ కాషాయ పార్టీ శాసనసభ్యులతో చర్చలు జరుపుతోందని, అంతేగాక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నన్ను త్వరలోనే అరెస్టు చేస్తామని బెదిరింపులకు పాల్పడుతోందని తెలిపారు. ఓ నాయకుడు మాట్లాడిన ఓ ఆడియో సైతం తమ దగ్గర ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ‘తాము 21 మంది ఎమ్మెల్యేలను సంప్రదించామని బీజేపీ చెబుతోంది. కానీ ఇప్పటి వరకు కేవలం ఏడుగురు ఎమ్మెల్యేలను మాత్రమే కాంటాక్ట్ అయ్యారు. వారంతా బీజేపీ ప్రతిపాదనను తిరస్కరించారు’ అని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఆప్‌ని ఓడించే శక్తిలేక ఢిల్లీలోని ఆప్‌ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ‘గత తొమ్మిదేళ్లలో ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ చాలా కుట్రలు చేసింది. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. ప్రజలు ఎల్లప్పుడూ మాకు మద్దతు ఇచ్చారు. మా ఎమ్మెల్యేలందరూ కలిసి బలంగా ఉన్నారు. ఈసారి కూడా వారి దుర్మార్గపు ఆలోచన విఫలమవుతుంది’ అని వెల్లడించారు.

రాజకీయ సంక్షోభం సృష్టించేందుకు కుట్ర: అతిషీ

ఢిల్లీలో ఆప్ ఎమ్మెల్యేల కొనుగోలు వార్తల నేపథ్యంలో ఢిల్లీ మంత్రి అతిషీ సైతం స్పందించారు. ఢిల్లీలో రాజకీయ సంక్షోభం సృష్టంచేందుకు బీజేపీ కుట్ర పనున్నతోందని విమర్శించారు. మధ్యప్రదేశ్, కర్ణాటక, అరుణాచల్ ప్రదేశ్‌లలో ప్రభుత్వాలను కూల్చివేసిన విషయాన్ని గుర్తు చేశారు. బీజేపీ ఎన్నికల్లో గెలవలేని చోట ప్రభుత్వాలను పడగొట్టేందుకు ఎంతకైనా తెగిస్తోందన్నారు. కాగా, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ)తో పొత్తును వదులుకుని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరడానికి సిద్ధమవుతున్నారనే వార్తల నేపథ్యంలో కేజ్రీవాల్ ఆరోపణలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కేజ్రీవాల్ చెప్పేవన్నీ అబద్దాలే: బీజేపీ

ఎమ్మెల్యేల కొనుగోలుపై కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఆప్ చీఫ్ చెప్పేవన్నీ అబద్దాలేనని బీజేపీ నేత కపిల్ మిశ్రా తెలిపారు. ‘ఆప్ ఎమ్మెల్యేలను సంప్రదించడానికి ఏ ఫోన్ నంబర్‌ను ఉపయోగించారు. ఎవరు సంప్రదించారు. సమావేశం ఎక్కడ జరిగింది. ఎప్పుడు జరిగింది. అనే విషయాలు కేజ్రీవాల్ చెప్పలేదు. ఇది కేవలం స్టేట్ మెంట్ మాత్రమే’ అని చెప్పారు. గతంలోనూ ఆయన ఏడు సార్లు ఇదే విషయంపై ఆరోపణలు చేశారని తెలిపారు.



Next Story