రాముడి నిధుల గోల్‌మాల్.. అయోధ్య బార్ అసోసియేషన్ సంచలన నిర్ణయం

by Malleboina Mahesh |

రామమందిర చందాల చోరీ కేసు నిందితులకు లాయర్లు ఎవరూ సహకరించవద్దు.. మీరితే రూ. 5 లక్షల ఫైన్: అయోధ్య బార్ అసోసియేషన్!

రాముడి నిధుల గోల్‌మాల్.. అయోధ్య బార్ అసోసియేషన్ సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: అయోధ్య రాముని ఆలయంలో నిధుల గోల్ మాల్ కేసు (Fundraising Gol Mall case) ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో ఈ కేసు విషయంలో అయోధ్య బార్ అసోసియేషన్ (Ayodhya Bar Association) సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై ఈ రోజు ఉదయం సమావేశం అయిన లాయర్లు.. కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘోర అవినీతి కేసులో అరెస్ట్ అయిన ఎనిమిది మంది నిందితులకు వ్యతిరేకంగా అయోధ్య బార్ అసోసియేషన్ అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకుంది. రామమందిర పవిత్రతను, కోట్ల మంది భక్తుల నమ్మకాన్ని దెబ్బతీసిన నిందితులకు స్థానికంగా ఎలాంటి న్యాయసహాయం అందకూడదని బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాళికా ప్రసాద్ మిశ్రా (Kalika Prasad Mishra) స్పష్టం చేశారు. ఈ కేసులో నిందితుల తరపున జిల్లాకు చెందిన ఏ ఒక్క న్యాయవాది కోర్టులో వకాల్తా పుచ్చుకోకూడదని, ఒకవేళ ఈ నిర్ణయాన్ని ధిక్కరించి ఎవరైనా నిందితులను సమర్థిస్తూ కోర్టులో వాదిస్తే, సదరు లాయర్‌పై అసోసియేషన్ తరఫున రూ. 5 లక్షల భారీ జరిమానా విధిస్తామని ఆయన హెచ్చరించారు.

మందిరం, భక్తుల ప్రయోజనాలకు అనుగుణంగానే న్యాయవాదుల ఉమ్మడి సమావేశంలో ఈ ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నట్లు కాళికా ప్రసాద్ మిశ్రా వివరించారు. కాగా, ఈ చందాల చోరీ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఇప్పటికే నిందితుల నుంచి సుమారు రూ. 80 లక్షల నగదును రికవరీ చేసింది. నిందితులలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఉద్యోగులతో పాటు కొందరు ప్రభుత్వ సిబ్బంది కూడా ఉండటం గమనార్హం. నిందితులను సోమవారం అయోధ్యలోని అవినీతి నిరోధక ప్రత్యేక కోర్టులో హాజరుపరిచిన తరుణంలో, కోర్టు వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. స్థానిక లాయర్లు ఎవరూ నిందితుల తరపున నిలబడటానికి నిరాకరించడంతో ఈ కేసు ఇప్పుడు చట్టపరంగా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

Next Story