వయనాడ్‌ నుంచి రాహుల్ నామినేషన్: భారీగా హాజరైన ప్రజలు

by Dishanational2 |
వయనాడ్‌ నుంచి రాహుల్ నామినేషన్: భారీగా హాజరైన ప్రజలు
X

దిశ, నేషనల్ బ్యూరో: కేరళలోని వయనాడ్ పార్లమెంటు స్థానం నుంచి మరోసారి ఎంపీగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. తన సోదరి ప్రియాంక గాంధీ, ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, దీపాదాస్ మున్షీలతో సహా ఇతర పార్టీ సీనియర్ నేతలతో కలిసి రిటర్నింగ్ అధికారి అయిన వయనాడ్ జిల్లా కలెక్టర్‌కు నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్‌కు ముందు రాహుల్ వయనాడ్‌లో రోడ్ షో నిర్వహించగా భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ..వయనాడ్‌కు ఎంపీగా ఉండటం తన అదృష్టమని తెలిపారు. రాష్ట్రంలో అనేక మంది ప్రాణాలను బలిగొన్న మానవ-జంతు ఘర్షణలతో సహా అన్ని సమస్యలపై తాను ఎల్లప్పుడూ వయనాడ్ ప్రజలతో ఉంటానని చెప్పారు.

మరోవైపు ఇదే స్థానం నుంచి రాహుల్ పై పోటీ చేస్తున్న సీపీఐ నేత రాజా కూడా నామినేషన్ వేశారు. ఇక్కడ బీజేపీ తరఫున కేకే సురేంద్రన్ పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ పోటీచేయగా..వయనాడ్‌లో గెలుపొందారు. మొత్తం 10,92,197 ఓట్లకు గాను రాహుల్ 7,06,367 ఓట్లు సాధించి సీపీఐకి చెందిన పీపీ సుపీర్ పై విజయం సాధించారు. కాగా, లోక్‌సభ ఎన్నికలకు రెండో దశ ఓటింగ్‌లో భాగంగా వయనాడ్‌లో ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది.



Next Story

Most Viewed