రూ.3 లక్షల రుణమాఫీ.. రూ. 500కే సిలిండర్ : Rahul Gandhi

by Disha Web Desk 4 |
రూ.3 లక్షల రుణమాఫీ.. రూ. 500కే సిలిండర్ : Rahul Gandhi
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచిత హామీలపై చర్చ జరుగుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ సంచలన ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో బీజేపీని ఎదుర్కోవడమే టార్గెట్ గా ఆయన చేసిన ప్రకటనలు ఆసక్తిగా మారాయి. తాము అధికారంలోకి వస్తే రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఏడాది చివరిలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో ఆయన ఇచ్చిన హామీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. సోమవారం ఆయన గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన పరివర్తన్ సంకల్ప్ ర్యాలీలో పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గుజరాత్ లోని ముంద్రా పోర్ట్ నుండి యధేచ్చగా డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని ఆరోపించారు. అయినా ఇక్కడి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. గుజరాత్ మోడల్ అంటే ఇదేనా అని ఎద్దేవా చేశారు. నిరసన తెలిపే ముందు అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్న రాష్ట్రం గుజరాత్ అని, ఎవరికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తామో వారి నుండి పర్మిషన్ తీసుకోవాలట అని విమర్శించారు.

బీజేపీ ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తల రుణాలను మాఫీ చేస్తోంది తప్ప.. రైతు రుణాలను మాఫీ చేసినట్లు ఎక్కడ కనిపించడం లేదని మండిపడ్డారు. సర్దార్ పటేల్ రైతుల గొంతుకగా నిలిచారని.. ఒక వైపు బీజేపీ ఆయన ఎత్తైన విగ్రహాన్ని తయారు చేస్తూనే మరో వైపు ఆయన ఎవరి కోసం పోరాటం చేశారో వారికి వ్యతిరేకంగా పని చేస్తోందని దుయ్యబట్టారు. బీజేపీ పాలనలో ఎల్పీజీ సిలిండర్ ధరలు ఆకాశానంటుతున్నాయని, ప్రస్తుతం రూ.1000 దాటిపోయిందని విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లను ఆకర్షించేలా సంచలన హామీలు కురిపించారు.

గుజరాత్ ఓటర్లకు రాహుల్ గాంధీ హామీలు

-గుజరాత్ రైతులకు రూ. 3 లక్షల వరకు రుణమాఫీ

-రూ. 500 లకే ఎల్పీజీ సిలిండర్

-సాధారణ వినియోగదారులకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్

-10 లక్షల కొత్త ఉద్యోగాల కల్పన

-3,000 ఆంగ్ల మాధ్యమ పాఠశాలలను నిర్మాణం

-ఆడ పిల్లలకు ఉచిత విద్య

-కోవిడ్ -19తో మరణించిన బాధితులకు రూ. 4 లక్షల పరిహారం

-పాల ఉత్పత్తిదారులకు రూ.5 సబ్సిడీ

రాహుల్ గాంధీ మాస్టర్ ప్లాన్

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తీవ్ర సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటోంది. రాబోయే ఎన్నికల్లో తిరిగి అధికారం కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జరగనున్న ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ద్వారానే తమ టార్గెట్ చేరుకోవాలని ఉద్దేశంతో కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ గుజరాత్ ఓటర్లపై కురిపించిన ఉచిత హామీలు చర్చకు దారి తీశాయి. రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచిత హామీలు దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగించేలా ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ప్రకటించింది. సుప్రీంకోర్టులోనూ ఈ అంశంపై కేసు నడుస్తోంది. ఈ క్రమంలో ప్రధాని మోడీకి చెక్ పెట్టేలా ప్రజలకు పెద్ద ఎత్తున ఉచిత వరాలు ప్రకటించారనే చర్చ మొదలైంది. రాబోయే రోజుల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఇలాంటి మరిన్ని ఉచిత హామీల వర్షం కురిపించబోతుందా అనే సందేహాలు పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి.

Next Story