Punjab: పంజాబ్ కల్తీ మద్యం ఘటన.. 21కి చేరిన మృతుల సంఖ్య

by B.Srinivas |

పంజాబ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కల్తీ మద్యం తాగి 21 మంది ప్రాణాలు కోల్పోగా మరో 9 మంది పరిస్థితి విషమంగా ఉంది.

Punjab: పంజాబ్ కల్తీ మద్యం ఘటన.. 21కి చేరిన మృతుల సంఖ్య
X

దిశ, నేషన్ బ్యూరో: పంజాబ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కల్తీ మద్యం తాగి 21 మంది ప్రాణాలు కోల్పోగా మరో 9 మంది పరిస్థితి విషమంగా ఉంది. అమృత్‌సర్ (Amruthsir) జిల్లాలోని మజిత ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పాతాల్‌పురి, కర్నాల, మరారి కలాన్, భంగాలి, థెరెవాల్ గ్రామాల్లో మరణాలు సంభవించాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కల్తీ మద్యం పంపిణీ చేసిన కేసులో ప్రధాన నిందితుడు సాహిబ్ సింగ్ సహా 10 మందిని అరెస్టు చేశారు. అలాగే విధులను నిర్వర్తించడంలో నిర్లక్ష్యం వహించిన స్థానిక డీఎస్పీ, స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) లను సస్పెండ్ చేసినట్లు డీజీపీ గౌరవ్ యాదవ్ (Gowrav yadav) తెలిపారు. అధికారులపై శాఖాపరమైన విచారణలు ప్రారంభించినట్టు వెల్లడించారు. అయితే నిందితులు ఆన్ లైన్‌లో 50 లీటర్ల ఇథనాల్ కొనుగోలు చేసి దీని ద్వారా మద్యం తయారు చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.

బాధిత కుటుంబాలకు సీఎం పరామర్శ

బాధిత కుటుంబాలను సీఎం భగవంత్ మాన్ (Bhaavanth mann) పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ. 10లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. క్షతగాత్రులు అమృత్‌సర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ ఘటనపై స్పందించిన ప్రతిపక్షాలు ఆప్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. కల్తీ మద్యాన్ని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించాయి. సీఎం వెంటనే తన పదవికి రిజైన్ చేయాలని డిమాండ్ చేశాయి.

Next Story