- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Punjab: పంజాబ్ను ముంచెత్తిన వరదలు.. 37 మంది మృతి
పంజాబ్ లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో వరదలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్ లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో వరదలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పలు ఘటనల్లో రాష్ట్ర వ్యాప్తంగా 37 మంది మరణించగా, 3.5 లక్షల మందికి పైగా ప్రజలు ప్రభావితమైనట్టు అధికారులు తెలిపారు. 23 జిల్లాల్లో 1655 గ్రామాలు నీట మునిగాయి. 1.48 లక్షల హెక్టార్లకు పైగా పంట నాశనం అయింది. 1988 తర్వాత పంజాబ్లో అతి తీవ్రమైన వరదలు రావడం ఇదే మొదటి సారి అని అధికారులు పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్ , జమ్మూ కశ్మీర్లోని పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా సట్లెజ్, బియాస్, రావి నదులు ఉప్పొంగి ప్రవహించడం వలన పంజాబ్ భారీ వరదలను చవిచూస్తోంది. దీంతో పాటు భారీ వర్షాలు తోడవడంతో పరిస్థితిని తీవ్ర రూపం దాల్చింది. గురుదాస్పూర్, పఠాన్కోట్, ఫాజిల్కా, కపుర్తలా, తర్న్ తరణ్, ఫిరోజ్పూర్, హోషియార్పూర్, అమృత్సర్ జిల్లాల్లోని గ్రామాలు వరదల వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యాయి. ప్రతికూల పరిస్థితి ఉండటంతో ఈనెల 7 వరకు ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. మరోవైపు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు.






