ఢిల్లీ బార్డర్లు సీల్.. ఇనుప మేకులు, ముళ్ల తీగలు, కాంక్రీట్‌ పిల్లర్లతో రోడ్లు

by Dishanational4 |
ఢిల్లీ బార్డర్లు సీల్.. ఇనుప మేకులు, ముళ్ల తీగలు, కాంక్రీట్‌ పిల్లర్లతో రోడ్లు
X

దిశ, నేషనల్ బ్యూరో : రైతులు మరోసారి ఢిల్లీ వైపుగా కదంతొక్కారు. ప్రత్యేకించి పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల రైతులు ట్రాక్టర్లు, ట్రాలీలు, బస్సులు, ట్రక్కులు, వాణిజ్య వాహనాలు, వ్యక్తిగత వాహనాలు, గుర్రాలపై హస్తిన దిశగా బయలుదేరారు. పంటల కనీస మద్దతు ధరకు హామీ ఇచ్చే చట్టం సహా ఇతర డిమాండ్లను నెరవేర్చాలని కేంద్ర సర్కారును డిమాండ్ చేస్తూ అన్నదాతలు నిరసన బాట పట్టారు. సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా సహా 200కుపైగా రైతు సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా మంగళవారం (ఫిబ్రవరి 13న) జరిగే ‘చలో ఢిల్లీ’ కార్యక్రమంలో రైతన్నలు పెద్దసంఖ్యలో పాల్గొననున్నారు. లక్షలాది సంఖ్యలో రైతులు ఢిల్లీ బార్డర్‌కు చేరుకొని బైఠాయించి నిరసన తెలుపుతారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన పోలీసులు ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలకు చేరుకోకుండా నిలువరించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టారు. 5,000 మందికిపైగా భద్రతా సిబ్బందిని మోహరించారు.

భద్రతా ఏర్పాట్లు ఇలా..

పంజాబ్-హర్యానా, ఢిల్లీ-హర్యానా సరిహద్దులలోని రోడ్లను బారికేడ్లు, బండరాళ్లు, ముళ్ల తీగలు, ఇనుప మేకులతో నింపేశారు. కాంక్రీట్‌ పిల్లర్లతో సరిహద్దు రోడ్లకు తాత్కాలిక సీల్ వేశారు. ఇసుకతో నింపిన టిప్పర్లను రోడ్లకు అడ్డంగా నిలబెట్టారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఢిల్లీ చుట్టూ ఉన్న బార్డర్ ఏరియాల్లో 144 సెక్షన్ విధించారు. హర్యానా ప్రభుత్వం ఏడు జిల్లాల్లో మూడు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. అంబాలా, కురుక్షేత్ర, కైథాల్, జింద్, హిస్సార్, ఫతేహాబాద్, సిర్సా జిల్లాల్లో ఫిబ్రవరి 11న ఉదయం 6 గంటల నుంచి ఫిబ్రవరి 13న రాత్రి 12 గంటల వరకు ఇంటర్నెట్‌ ఉండదని తెలిపింది. మరోవైపు రైతు సంఘాలతో చర్చలు జరిపేందుకు కేంద్ర సర్కారు సిద్ధమైంది. తమ డిమాండ్లపై చర్చించేందుకు కేంద్రం తమను సోమవారం సమావేశానికి ఆహ్వానించిందని రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ వెల్లడించారు. ముగ్గురు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండా, నిత్యానంద్ రాయ్ సోమవారం చండీగఢ్‌కు చేరుకొని తమతో చర్చలు జరుపుతారని చెప్పారు.

Next Story

Most Viewed