సోషల్ మీడియా దుర్వినియోగంపై సుప్రీంకోర్టు ఆందోళన

by Dishanational1 |
సోషల్ మీడియా దుర్వినియోగంపై సుప్రీంకోర్టు ఆందోళన
X

దిశ, నేషనల్ బ్యూరో: న్యాయపరిశీలనకు సంబంధించిన విషయాలపై సందేశాలు, వ్యాఖ్యలు, కథనాలతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను దుర్వినియోగం చేయడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయమూర్తులు అనిరుద్ధ బోస్, బేలా త్రివేదీలతో కూడిన ధర్మాసనం తీర్పు కోసం రిజర్వ్ చేసిన కేసుకు సంబంధించి ఫేస్‌బుక్ పోస్ట్‌ను తప్పుదారి పట్టించినందుకు అస్సాం ఎమ్మెల్యే కరీం ఉద్దీన్ బర్భూయాపై ధిక్కార చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది. 'ఇటీవల కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న విషయాలకు సంబంధించిన అంశాలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విపరీతంగా దుర్వినియోగం చేయడం తీవ్రమైన ఆందోళన కలిగించేదిగా ఉంది. న్యాయస్థానాలు నిందలు, విమర్శలను భరించేంత విశాలత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ, కోర్టులో పెండింగ్‌లో ఉన్న విషయాలకు సంబంధించిన వ్యాఖ్యలు, పోస్ట్‌లు వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తీకరణ హక్కు ముసుగులో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా న్యాయస్థానాల అధికారాన్ని అణగదొక్కడం లేదా న్యాయానికి అంతరాయం కలిగించే ధోరణిని కలిగి ఉండటం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని' ధర్మాసనం పేర్కొంది. న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నప్పుడు కొన్నిసార్లు ఏ పక్షానికైనా అనుకూలంగా, కొన్నిసార్లు వ్యతిరేకంగా వ్యవహరించడం చాలా సాధారణమని అత్యున్నంత న్యాయస్థానం అభిప్రాయపడింది.

Next Story

Most Viewed