- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Priyanka: వయనాడ్లో ప్రియాంక గాంధీ పర్యటన.. నిరసన తెలిపిన సీపీఎం
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ కేరళలోని తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వయనాడ్లో మంగళవారం పర్యటించారు.

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) కేరళలోని తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వయనాడ్(Wayanad)లో మంగళవారం పర్యటించారు. మనంతవాడి (Manantha wadi) లోని కనియాపురంలో ఇటీవల పులి దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాధిత మహిళ రాధ కుటుంబాన్ని పరామర్శించి తన సంతాపాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ.. మనంతవాడి ప్రాంతంలో జంతు సమస్య చాలా క్లిష్టంగా మారిందని తెలిపారు. ఈ సమస్యపై ఐక్యంగా కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక కమ్యూనిటీకి ఈ ప్రాంతం గురించి మంచి అవగాహన ఉందని, కానీ ఇటువంటి విషాదాలను అరికట్టడానికి తగిన ఫెన్సింగ్ లేదని తెలిపారు. వన్యప్రాణులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో నిధులు రాబట్టడం కూడా సమస్యగా ఉందన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నిధులు వెచ్చిస్తు్న్నా అవి సరిపోవడం లేదని, సీఎస్ఆర్ (CSR) నిధులతో కొన్ని పనులు చేయొచ్చని వెల్లడించారు. కానీ తగిన నిధులు లేకుండా సమస్యను పరిష్కరించలేమని, ఈ అంశాన్ని పార్లమెంటు (Parliament)లో లేవనెత్తుతానని స్పష్టం చేశారు. కాగా, పంచరకోళిలో పులి దాడిలో గిరిజన మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే పులిని పట్టుకోవాలని అధికారులు ప్రయత్నించగా అప్పటికే పులి మరణించింది. పులి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా.. కడుపులో ఓ మహిళ చీర, ఇతర వస్తువులు కనిపించాయి.
సీపీఎం నిరసన
ప్రియాంక గాంధీ పర్యటన నేపథ్యంలో సీపీఎం కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన తెలిపారు. పులి దాడిలో ప్రాణాలు కోల్పోయిన మహిళ కుటుంబాన్ని కలవడంలో ప్రియాంక జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. మానవ-జంతు సంఘర్షణపై ఆలస్యంగా స్పందించారని, ఇది సరైన పద్దతి కాదని తెలిపారు. సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపాలని డిమాండ్ చేశారు. సీపీఎం ఆందోళనల నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.






