అయోధ్యలో విగ్రహ ప్రతిష్టాపన రాష్ట్రపతి చేపట్టాలి: ఉద్ధవ్ థాక్రే

by Dishanational2 |
అయోధ్యలో విగ్రహ ప్రతిష్టాపన రాష్ట్రపతి చేపట్టాలి: ఉద్ధవ్ థాక్రే
X

దిశ, నేషనల్ బ్యూరో: అయోధ్యలో రామమందిర ప్రతిష్టాపన కార్యక్రమాన్ని రాష్ట్రపతి నిర్వహించాలని శివసేన(యూబీటీ) నేత ఉద్ధవ్ థాక్రే డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. రామమందిరం దేశ ఆత్మగౌరవానికి ప్రతీక అని తెలిపారు. అయోధ్యలో విగ్రహ ప్రాణప్రతిష్ట జరిగే రోజున నాసిక్‌లోని కాలారామ్ ఆలయంలో జరిగే హారతిలో పాల్గొనాలని ముర్మును కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రామ మందిర నిర్మాణం తన తండ్రి బాలాసాహెబ్ థాక్రే కల అని అన్నారు. ఆలయ నిర్మాణం జరగడం ఎంతో సంతోషించదగ్గ విషయమన్నారు. గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయాన్ని పునరుద్ధరించిన తర్వాత.. దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా పునరుద్ధరణ వేడుకలు నిర్వహించారని గుర్తుచేశారు. కాబట్టి రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని కూడా రాష్ట్రపతి ముర్ముచే చేయించాలని చెప్పారు. కాగా,ఈనెల 22న తమ పార్టీ నేతలతో నాసిక్‌లోని కాలారామ్ ఆలయాన్ని సందర్శించి నది ఒడ్డున మహా హారతి నిర్వహిస్తానని ఉద్ధవ్ గతంలో ప్రకటించారు.


Next Story

Most Viewed