మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లు.. 50 వేలకు పైగా పోస్టర్లు అతికించేలా AAP ప్లాన్..!

by Disha Web Desk 12 |
మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లు.. 50 వేలకు పైగా పోస్టర్లు అతికించేలా AAP ప్లాన్..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లు కలకలం రేపాయి. పోలీసులు నిర్వహించిన రెయిడ్‌లలో మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలతో కూడిన పోస్టర్లను పెద్దఎత్తున ఢిల్లీ పోలీసులు గుర్తించారు. ఈ విషయంతో సంబంధం ఉన్నదని భావిస్తున్న సుమారు 100 మంది పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఢిల్లీలో 50 వేలకు పోస్టర్లను మోడీకి వ్యతిరేకంగా అతికించేందుకు ప్లాన్ చేసినట్లు గుర్తించారు. మంగళవారం పలు ప్రాంతాల్లో అతికించిన దాదాపు రెండు వేల పోస్టర్లను పోలీసులు తొలగించారు. ఈ పోస్టర్లలో చాలా వరకు మోడీ హాఠావో.. దేశ్ బచావో అనే నినాదాలతో పాటు పీఎం పై వివాదాస్పద వ్యాఖ్యలు ఉన్నాయి. సెంట్రల్ ఢిల్లీలోని ఐపీ ఎస్టేట్ ప్రాంతంలో పోలీసుల తనిఖీలు నిర్వహించగా మోడీకి వ్యతిరేకంగా ఉన్న పోస్టర్లు తరలిస్తున్న వ్యాన్ ను పట్టుకున్నారు.

వీటిని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయానికి తీసుకువెళ్తున్నట్లు డ్రైవర్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో ఇద్దరికి ప్రింటింగ్ ప్రెస్ ఉందని, ప్రింటింగ్ ప్రెస్ పేరు లేకుండా పోస్టర్లను ప్రింట్ చేయడంపై ప్రెస్ యజమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు కేసులు నమోదు చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా విమర్శించింది. పోస్టర్లలో అభ్యంతరం ఏముందని ప్రశ్నిస్తూ ఆ పార్టీ ఓ ట్వీట్ చేసింది. ఇది మోడీ ప్రభుత్వ నియంతృత్వానికి పరాకాష్ట అని మండిపడింది. ఒక్క పోస్టర్ కే మోడీ భయపడితే ఎలా? బహుశా మోడీకి తెలియకపోవచ్చు ఇది భారత దేశం.. ప్రజాస్వామ్య దేశం అంటూ ట్వీట్ చేసింది.

Next Story

Most Viewed