ప్రధాని విదేశీ టూర్.. 8 రోజుల్లో ఐదు దేశాల్లో పర్యటన

by Naga Rani Yarlagadda |

నేటి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ టూర్ మొదలైంది. ఢిల్లీ నుంచి ఘనాకు బయల్దేరారు. 8 రోజుల్లో మొత్తం 5 దేశాల్లో పర్యటించనున్న మోదీ.. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి హాజరు కానున్నారు.

ప్రధాని విదేశీ టూర్.. 8 రోజుల్లో ఐదు దేశాల్లో పర్యటన
X

దిశ, వెబ్‌డెస్క్: నేటి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ టూర్ (PM Foreign Modi Tour) మొదలైంది. ఢిల్లీ నుంచి ఘనాకు బయల్దేరారు. 8 రోజుల్లో మొత్తం 5 దేశాల్లో పర్యటించనున్న మోదీ.. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి (BRICS Summit 2025) హాజరు కానున్నారు. ఘనా, ట్రినిడాడ్, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాలను ఆయన సందర్శించనున్నారు. నేడు, రేపు ఘనా, ట్రినిడాడ్ దేశాల్లో పర్యటిస్తారు. 30 ఏళ్లలో తొలిసారిగా ఘనా దేశ పర్యటనకు వెళ్తున్న తొలి భారత ప్రధాని నరేంద్రమోదీ కావడం విశేషం. ఇరుదేశాల మధ్య అభివృద్ధి, సహకారం, విద్య, ఇంధన, రక్షణ, ఇంధన రంగాల్లో భాగస్వామ్యాన్ని మెరుగుపరిచే దిశగా చర్చలు జరపనున్నారు. అక్కడ వ్యాక్సిన్ హబ్ ఏర్పాటుకు మద్దతు ఇవ్వనున్నారు. అలాగే ఘనా పార్లమెంట్ నుఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. భారతదేశం దిగుమతి చేసుకుంటున్న బంగారంలో 70 శాతానికి పైగా ఘనా నుంచే వస్తోంది. కాగా.. ప్రస్తుతం ఘనా అధ్యక్షుడిగా ఉన్న జాన్ మహామా 2015లో ఇండియా - ఆఫ్రికా ఫోరం సమ్మిట్ కోసం భారత్ ను సందర్శించారు.

ఘనా పర్యటన ముగిసిన అనంతరం కరేబియన్ దేశమైన ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశానికి వెళ్లనున్నారు. 1999 తర్వాత ఆ దేశంలో పర్యటిస్తున్న భారత ప్రధాని మోదీనే. ఆ దేశ అధ్యక్షురాలు క్రిస్టీన్ కార్లా కంగలూ, ప్రధాన మంత్రి కమ్లాపెర్సాద్ - బిస్సేసర్ లతో మోడీ సమావేశం కానున్నారు.

జులై 4,5 తేదీల్లో అర్జెంటీనాలో పర్యటిస్తారు. ఆ దేశ అధ్యక్షుడు జేవియర్ మిలీతో విస్తృత స్థాయి చర్చలు జరుపుతారు. రక్షణ, వ్యవసాయం, మైనింగ్, చమురు, గ్యాస్, పునరుత్పాదక శక్తి, వాణిజ్యం, పెట్టుబడులు వంటి కీలకరంగాల్లో ఇండియా - అర్జెంటీనా భాగస్వామ్యాన్ని మెరుగుపరచడంపై చర్చలు జరపనున్నారు. ఆ తరువాత జులై 6 నుంచి 8 తేదీల మధ్య బ్రెజిల్ లోని రియో డిజనోరోలో17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల నేతలు ఈ సమావేశంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పై చర్చించనున్నారు.

జులై 8,9 తేదీల్లో నమీబియా పర్యటనతో ప్రధాని విదేశీ టూర్ ముగుస్తుంది. ప్రధాని హోదాలో ఆయన నమీబియాలో పర్యటించడం ఇది మూడోసారి. గ్రీన్ ఎనర్జీ, వాటర్ టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, భారతదేశ యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (UPI) అమలు వంటి అంశాలపై ఆ దేశ అధ్యక్షుడితో చర్చించనున్నారు.

Next Story