PM Modi: పహెల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్ముకశ్మీర్లో మోడీ పర్యటన

by Shamantha N |   (  Updated:2025-06-06 13:51:22  IST  )

హెల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారిగా జమ్ముకశ్మీర్ పర్యటన చేపట్టారు. కశ్మీర్ కనెక్టివిటీ, ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించే కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించారు.

PM Modi: పహెల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్ముకశ్మీర్లో మోడీ పర్యటన
X

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారిగా జమ్ముకశ్మీర్ పర్యటన చేపట్టారు. కశ్మీర్ కనెక్టివిటీ, ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించే కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించారు. కేంద్రం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన (worlds highest rail bridge) చీనాబ్‌ బ్రిడ్జ్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Modi) శుక్రవారం ప్రారంభించారు. ఏప్రిల్‌ 22న పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రధాని తొలిసారి జమ్ము కశ్మీర్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అక్కడ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారించినది 272 కిలోమీటర్ల ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ (USBRL) ప్రారంభం. ఇది మూడు దశాబ్దాలుగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్. ఉధంపూర్‌-శ్రీనగర్‌-బారాముల్లా రైల్వే లింక్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించిన ఈ వంతెన జాతి సమగ్రత, ఇంజినీరింగ్‌ అద్భుతానికి ఓ చిహ్నం. ఇకపోతే, చీనాబ్ రైల్వే వంతెన ప్రారంభోత్సవం తర్వాత మోడీ ఆ వంతెన మీదుగా.. కాత్రా వరకు రైలులో ప్రయాణించారు. బారాముల్లా- కత్రా మధ్య రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సేవలు జూన్ 7న ప్రారంభమవుతాయి. వారానికి ఆరు రోజులు నడుస్తాయి.

చీనాబ్ రైలు వంతెన..

చీనాబ్ రైలు వంతెనను భారతీయ రైల్వే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఉక్కు, కాంక్రీట్‌తో నిర్మించిన ఈ వంతెన జమ్మూ కశ్మీర్‌లోని జమ్మూ డివిజన్ రియాసి జిల్లా బక్కల్ – కౌరీ మధ్య ఉంది. కశ్మీర్‌ను భారత్‌లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉధంపుర్‌-శ్రీనగర్‌-బారాముల్లా రైల్వే లింక్‌ ప్రాజెక్టులో భాగంగా చీనాబ్‌ వంతెనను నిర్మించారు. నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తున చీనాబ్‌ నదిపై 1,315 మీడర్ల పొడవైన వంతెనను నిర్మించారు. చైనాలోని బెయిసాన్‌ నదిపై నిర్మించిన 275 మీటర్ల పొడవైన షుబాయ్‌ రైల్వే వంతెన పేరుపై ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది. ఇక పారిస్‌లోని ప్రఖ్యాత ఐఫిల్‌ టవర్‌తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువగా ఉండటం విశేషం. 2003లో వాజ్‌పేయి ప్రభుత్వం వంతెన నిర్మాణానికి ఆమోదం తెలుపగా.. పూర్తి కావడానికి 22 ఏళ్లు పట్టింది. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా కశ్మీర్‌ లోయకు దేశంలోని మిగిలిన ప్రాంతాలకు రైల్వే అనుసంధానం ఏర్పడింది. భూకంపాలు, గంటకు 260 కిలోమీటర్ల వేగంతో వీచే బలమైన గాలుల్ని తట్టుకోగల ఈ వంతెన జీవితకాలం 120 ఏళ్లు. ఆర్చ్‌ ఆకృతిలో నిర్మించిన ఈ రైల్వే వంతెన పొడవు 1,315 మీటర్లు. ఈఫిల్‌ టవర్‌ కన్నా ఎత్తు ఎక్కువ. నదీగర్భం నుంచి ఈ బ్రిడ్జి 1,178 అడుగుల ఎత్తులో ఉంది. వంతెన నిర్మాణం కోసం 28 వేల టన్నుల స్టీల్‌, 6 లక్షల బోల్ట్‌లు వాడారు. నిర్మాణ వ్యయం రూ.1483 కోట్లు కాగా.. వంతెనకు ఇరువైపులా ఒక్కోటి 85 టన్నుల బరువుగల 93 డెక్‌ సెగ్మెంట్స్‌ను ఉపయోగించారు.

రైల్వే మంత్రి ఏమన్నారంటే?

బారాముల్లా- జమ్ము మధ్య మొత్తం ఐదు టెర్మినళ్లను నిర్మిస్తున్నామని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణన్ అన్నారు. ఇది పండ్లు, చేతిపనులు సహా ఇతర వస్తువుల రవాణాను గణనీయంగా సులభతరం చేస్తుందని చెప్పుకొచ్చారు. కశ్మీర్ నుండి చెర్రీలను రైలు ద్వారా రవాణా చేయడానికి ఇటీవల చేసిన ప్రయోగం విజయవంతమైందన్నారు. అదే నమూనాను ఇతర ఉత్పత్తులకు విస్తరించే అవకాశం ఉంది. కొత్త రైల్వే మౌలిక సదుపాయాలు కశ్మీర్‌కు ప్రయాణాన్ని జమ్ము-శ్రీనగర్ హైవేపై ఆధారపడకుండా చేస్తాయని భావిస్తున్నామన్నారు. హైవేపై తరచుగా కొండచరియలు విరిగిపడటం లేదా మంచు కారణంగా మూసివేస్తారని.. అలాంటి సమయంలో విమానధరలు కూడా పెరుగుతాయన్నారు. అందుకు ప్రత్యామ్నాయంగా ఈ వంతెన ఉపయోగపడుతుందన్నారు.

Next Story