ప్రధాని మోడీ నామినేషన్ తేదీ ఖరారు

by Dishanational1 |
ప్రధాని మోడీ నామినేషన్ తేదీ ఖరారు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మూడోసారి ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్న మోడీ నామినేషన్ తేదీని తాజాగా ఖరారు చేశారు. 2014,2019 లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆయన, ఈ నెల 14వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న మోడీ మే 13న తన పార్లమెంటరీ నియోజకవర్గాన్ని సందర్శించి, మే 14న భారీ రోడ్‌షో ద్వారా వెళ్లి నామినేషన్ దాఖలు చేయనున్నారు. వారణాసి నుంచి నామినేషన్ దాఖలు చేయడానికి ముందు, ప్రధానమంత్రి మే 5న అయోధ్యను సందర్శించనున్నారు. రామాలయంలో ప్రార్థనలు చేసిన అనంతరం నగరంలో భారీ రోడ్‌షో నిర్వహించనున్నారు. జనవరి 22న 'ప్రాణ్‌ప్రతిష్ఠ' కార్యక్రమం నిర్వహించిన తర్వాత ప్రధాని మోడీ అయోధ్యకు వెళ్లనున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికలలో, నరేంద్ర మోడీ తొలిసారిగా వారణాసి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అరవింద్ కేజ్రీవాల్‌పై పోటీ చేసి 3,71,784 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి అజయ్‌రాయ్‌పై 4,79,505 ఓట్ల తేడాతో ప్రధాని మోడీ విజయం సాధించారు. జూన్ 1న లోక్‌సభ ఎన్నికల చివరి దశ(ఏడవది) వారణాసిలో పోలింగ్ జరగనుంది. ఫలితాలు జూన్ 4న వెలువడతాయి.

Next Story

Most Viewed