2026 ఆగస్టు కల్లా తొలి బుల్లెట్ ట్రైన్.. ఏడాది చివర్లో హైడ్రోజన్ రైలు: రైల్వే మంత్రి

by Disha Web Desk 17 |
2026 ఆగస్టు కల్లా తొలి బుల్లెట్ ట్రైన్.. ఏడాది చివర్లో హైడ్రోజన్ రైలు: రైల్వే మంత్రి
X

న్యూఢిల్లీ: రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రధానమంత్రిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయనను 'వెరీ డిమాండింగ్ బాస్' అని అభివర్ణించారు. రాబోయే 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని దేశాన్ని అభివృద్ధి సారించడంపై ప్రధాని దృష్టి సారించారని ఆయన అన్నారు. దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ను 2026 ఆగస్టు కల్లా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.

ఇండియా టీవీ సంవాద్ బడ్జెట్ 2023 పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలో తొలి బుల్లెట్ రైలు దిశగా పురోగతి సాధిస్తుందని చెప్పారు. జపాన్ వారు తరచుగా వస్తూ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారని అన్నారు. అంతేకాకుండా తొలి హైడ్రోజన్ రైలును ఈ ఏడాది డిసెంబర్ చివర్లోపు ఆవిష్కరిస్తామని తెలిపారు. అంతేకాకుండా ప్రధాన నగరాల పరిసరాల్లోని పట్టణ ప్రాంతాలను అనుసంధానం చేసేందుకు వందే భారత్ మెట్రో రైళ్లను కూడా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

ప్రపంచ స్థాయి సదుపాయాలు, నాణ్యతతో ఈ సేవలను అందిస్తామని చెప్పారు. రాబోయే ఏడాదిలో ఈ రైలును ఆవిష్కరిస్తామని తెలిపారు. మరోవైపు నిమిషానికి టికెట్లు ఇచ్చే సామర్థ్యాన్ని 25 వేల నుంచి 2.25 లక్షలకు పెంచనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఎంక్వైరీలను కూడా 40 వేల నుంచి 4 లక్షలకు పెంచుతామని చెప్పారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో 7వేల కిలోమీటర్ల కొత్త రైల్వే ట్రాక్‌లను నిర్మించే లక్ష్యాన్ని పెట్టుకున్నామన్నారు. కాగా, తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రైల్వేకు రికార్డు స్థాయిలో రూ.2.40 లక్షల కోట్లు కేటాయింపులు చేసినట్లు కేంద్రం ప్రకటించింది.


Next Story

Most Viewed