Pm modi: ప్రపంచ సంస్థల్లో గ్లోబల్ సౌత్‌కు అన్యాయం.. బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోడీ

by B.Srinivas |

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి భారతదేశానికే కాదని ఇది మొత్తం మానవాళిపై జరిగిన దాడి అని మోడీ అభివర్ణించారు.

Pm modi: ప్రపంచ సంస్థల్లో గ్లోబల్ సౌత్‌కు అన్యాయం.. బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి భారతదేశానికే కాదని ఇది మొత్తం మానవాళిపై జరిగిన దాడి అని ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) అభివర్ణించారు. మానవాళి ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సవాళ్లలో ఉగ్రవాదం ఒకటని నొక్కి చెప్పారు. బ్రెజిల్‌లో ఆదివారం జరిగిన17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో మోడీ ప్రసంగించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బ్రిక్స్ దేశాలు స్పష్టమైన, ఏకీకృత వైఖరిని అవలంబించాలన్నారు. ఏదైనా దేశం ట్రెరిజానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మద్దతిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. వ్యక్తిగత లేదా రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాదానికి మద్దతిచ్చే చర్యలను ఉపేక్షించొద్దని తెలిపారు. ఉగ్రవాదాన్ని ఖండించడం ఒక సూత్రంగా ఉండాలని, సౌలభ్యం కోసం కాదని నొక్కి చెప్పారు.

ప్రపంచ సంస్థలను ఆధునీకరించాలి

20వ శతాబ్దంలో ఏర్పాటైన ప్రపంచ సంస్థలు 21వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కోలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) యుగంలో, సాంకేతికత ప్రతి వారం అప్ డేట్ అవుతుందని, కానీ ఒక ప్రపంచ సంస్థ 80 సంవత్సరాలకు ఒకసారి కూడా నవీకరించబడటం లేదని తెలిపారు. 20వ శతాబ్దపు టైప్‌రైటర్లు 21వ శతాబ్దపు సాఫ్ట్‌వేర్‌ను అమలు చేయలేవని, కాబట్టి గ్లోబల్ ఆర్గనైజేషన్స్ ప్రస్తుత సాంకేతిక పురోగతికి అనుగుణంగా ఆధునీకరించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల మందికి ఈ సంస్థల్లో సరైన ప్రాతినిధ్యం లేదన్నారు. అంతర్జాతీయ వ్యవహారాలలో గ్లోబల్ సౌత్ ద్వంద్వ ప్రమాణాల బాధితురాలుగా మిగిలిపోయిందని, అభివృద్ధి, భద్రతను నియంత్రించే ప్రపంచ వ్యవస్థలలో ప్రమేయం ఉండటం లేదని చెప్పారు. ప్రతి విషయంలోనూ అన్యాయం జరుగుతుందని తెలిపారు.

పహల్గామ్ దాడిని ఖండించిన బ్రిక్స్

పహెల్గాం ఉగ్రదాడిని బ్రిక్స్ దేశాలు ఖండించాయి. ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఉగ్రవాద చర్యలు నేరపూరితమైనవని, సమర్థించలేనివని తెలిపాయి. ‘2025 ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరించాలి. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ద్వంద్వ ప్రమాణాలను తిరస్కరించాలి’ అని పేర్కొంది.

Next Story