Pm modi: ఢిల్లీ యువతకు ఆప్, కాంగ్రెస్‌లు ద్రోహం చేశాయి.. ప్రధాని మోడీ విమర్శలు

by B.Srinivas |

క్రీడల అభివృద్ధి పేరుతో ఢిల్లీ యువతకు ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలు ద్రోహం చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు.

Pm modi: ఢిల్లీ యువతకు ఆప్, కాంగ్రెస్‌లు ద్రోహం చేశాయి..  ప్రధాని మోడీ విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: క్రీడల అభివృద్ధి పేరుతో ఆమ్ ఆద్మీ పార్టీ (Aap), కాంగ్రెస్ పార్టీ (Congress party) లు ఢిల్లీ యువతకు ద్రోహం చేశాయని ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) ఆరోపించారు. ఆప్ పాలనలో దేశ రాజధానిలో 11ఏళ్ల సమయం వృథా అయిందని విమర్శించారు. ఢిల్లీలోని ఆర్కే పురంలో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోడీ ప్రసంగించారు. కామన్వెల్త్ కుంభకోణం ఆరోపణల నుంచి కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ బయటపడబోదన్నారు. ఢిల్లీలో స్పోర్ట్స్ యూనివర్శిటీ (Sports University) పేరుతో ఆప్-దా పార్టీ ఏం చేసిందో ఢిల్లీ ప్రజలకు, యువతకు బాగా తెలుసన్నారు. అందుకే ఇక్కడి యువత బీజేపీతోనే ఉందని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తే మురికివాడలను కూల్చివేయబోమని స్పష్టం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఆప్ పుకార్లు వ్యాపింపజేస్తోందని ఫైర్ అయ్యారు. బీజేపీ పాలనలో ఎలాంటి ప్రజా సంక్షేమ పథకాలు నిలిపివేయబడవని హామీ ఇచ్చారు.

బసంత్ పంచమితో ఢిల్లీలో వాతావరణం మారిందని, మూడు రోజుల తర్వాత ఢిల్లీకి మరిన్ని మంచి రోజులు రానున్నాయని తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన కేంద్ర బడ్జెట్‌పై మోడీ ప్రశంసలు కురిపించారు. ఈ బడ్జెట్ మధ్య తరగతి ప్రజల బడ్జెట్ అని కొనియాడారు. కొత్త బడ్జెట్‌తో మధ్యతరగతి ప్రజలకు అవసరమయ్యే రోజువారీ నిత్యావసరాలు, వినియోగ వస్తువులు మరింత తక్కువ ధరకే దొరుకుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బడ్జెట్‌ విధానం పొదుపును బలోపేతం చేస్తుందని, అభివృద్ధిలో పౌరులను భాగస్వాములను చేస్తుందని మోదీ కొనియాడారు.

పోలింగ్‌కు ముందే ఆప్ పార్టీ నుంచి వలసలు ప్రారంభమయ్యాయని, రానున్న రోజుల్లో ఇవి మరింత పెరుగుతాయని తెలిపారు. ఆప్‌పై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, వారిని ద్వేషిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఢిల్లీలోని ప్రతి సమస్య పరిష్కారం అవుతుందని నొక్కి చెప్పారు. ప్రజా ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నామని, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రయోజనకరమైన పథకాలను నిలిపివేయబోమని వెల్లడించారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 5న జరగనున్నాయి.

Next Story