యుద్ధం ముదిరినా పెరగని పెట్రో ధరలు.. చమురు సంస్థలకు కేంద్రం కీలక ఆదేశం!

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-20 13:11:49  IST  )

పశ్చిమాసియాలో యుద్ధం ముదిరినా.. భారత్‌లో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.

యుద్ధం ముదిరినా పెరగని పెట్రో ధరలు.. చమురు సంస్థలకు కేంద్రం కీలక ఆదేశం!
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమాసియా యుద్ధంతో రగిలిపోతోంది. అగ్రరాజ్యం అమెరికా (America), ఇరాన్ (Iran) మధ్య ఘర్షణ పరాకాష్టకు చేరడంతో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 120కి పైగా దేశాల్లో పెట్రోల్ ధరలు 40 శాతం వరకు పెరిగినా, భారత్‌లో మాత్రం పెట్రోల్ పంపుల వద్ద ధరలు నిలకడగా ఉండటం ఒక ఆశ్చర్యకరమైన విషయంగా మారింది. అయితే, ఫిబ్రవరి 28న ఇరాన్‌పై యుద్ధం మొదలైనప్పటి నుంచి అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 95 డాలర్లకు పైగా చేరుకుంది. దీని ప్రభావంతో అమెరికాలో గ్యాసోలిన్ ధరలు భారీగా పెరిగాయి. పొరుగు దేశమైన పాకిస్థాన్‌ (Pakistan)లో లీటరు పెట్రోల్ ధర రూ.458.40కి చేరగా, నేపాల్, శ్రీలంకలలో కూడా సామాన్యులు ఇంధనం కోసం గంటల తరబడి క్యూ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. బంగ్లాదేశ్‌లో కూడా ఇటీవలే పెట్రోల్ ధరలను భారీగా పెంచారు.

భారత్‌లో ‘ఎన్నికల’ ఎఫెక్ట్..

ప్రపంచవ్యాప్తంగా చమురు సెగలు పుడుతున్నా భారత్‌ (India)లో ధరలు స్థిరంగా ఉండటం వెనుక పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలే ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏప్రిల్ 28న బెంగాల్ ఎన్నికల చివరి విడత పోలింగ్ ముగిసే వరకు ధరలను పెంచవద్దని కేంద్ర ప్రభుత్వం చమురు సంస్థలను ఆదేశించినట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఎన్నికల సమయంలో ఇలాగే ధరలను స్థిరంగా ఉంచిన సందర్భాలు ఉన్నాయి. మరోవైపు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినప్పటికీ, దేశీయంగా రేట్లను పెంచకపోవడంతో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు (OMCs) భారీగా నష్టపోతున్నాయి. ప్రస్తుతం లీటరు పెట్రోల్‌పై రూ.18, డీజిల్‌పై రూ.35 నష్టాన్ని ఈ సంస్థలు భరిస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు, హర్మూజ్ జలసంధి మూసివేత, ఇరాన్ డ్రోన్ దాడుల వల్ల చమురు సరఫరా వ్యవస్థకు తీవ్ర విఘాతం కలిగింది.

చమురు నిల్వలపై కేంద్రం భరోసా..

సరఫరాలో అంతరాయం ఉన్నప్పటికీ, దేశంలో ఇంధన కొరత లేదని ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో (PIB) స్పష్టం చేసింది. భారత్ వద్ద ప్రస్తుతం 74 రోజులకు సరిపడా వ్యూహాత్మక చమురు నిల్వలు ఉన్నాయని, అందువల్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది. ఎల్పీజీ (LPG) సరఫరాలో అక్కడక్కడా వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, పెట్రోల్, డీజిల్ సరఫరా మాత్రం సురక్షితంగా ఉందని వెల్లడించింది.

మే 4 తర్వాత భారీగా పెరగనున్న ధరలు?

ఎన్నికల ఫలితాలు వచ్చే మే 4 తర్వాత భారతీయులపై పెట్రో బాదుడు ఖాయమని విపక్ష నేతలు హెచ్చరిస్తున్నారు. కేవలం ఓట్ల కోసమే మోదీ ప్రభుత్వం ధరలను కృత్రిమంగా ఆపుతోందని రాహుల్ గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ ఆరోపిస్తున్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ ఎక్కువ కాలం ఈ ధరలను నిలకడగా ఉంచడం అసాధ్యమని, గ్రాడ్యువల్ పెంపు తప్పదని నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు.

Hormuz : భారత నౌకలపై కాల్పుల ఘటన.. స్పందించిన ఇరాన్ కీలక ప్రకటన

Next Story