సీఏఏపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు: మమతాపై అమిత్ షా ఫైర్

by Dishanational2 |
సీఏఏపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు: మమతాపై అమిత్ షా ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. ‘బీజేపీ సీఏఏ చట్టాన్ని ఆమోదించింది. దీనితో ఎటువంటి సమస్యా లేదు. కానీ సీఏఏ కోసం ధరఖాస్తు చేస్తే పౌరసత్వం కోల్పోతారని మమతా చెబుతోంది. అందులో వాస్తవం లేదు’ అని తెలిపారు. పౌరసత్వం కోసం శరణార్థులు అప్లై చేసుకోవాలని సూచించారు. సీఏఏతో ఎటువంటి సమస్యా లేదని తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని బాలూర్‌ఘాట్‌లో బుధవారం జరిగిన ర్యాలీలో అమిత్ షా ప్రసంగించారు. మమతా బెనర్జీ సీఏఏను ఎంత వ్యతిరేకించినా శరణార్థులందరికీ పౌరసత్వం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో చొరబాట్లను ఆపేందుకు మమతా ఏనాడూ చొరవ తీసుకోలేదని విమర్శించారు. ఎందుకంటే చొరబాటు దారుల ఓట్లే టీఎంసీకి అత్యధికంగా ఉన్నాయని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం మాత్రమే చొరబాట్లను ఆపగలదని దీమా వ్యక్తం చేశారు. కాబట్టి బెంగాల్‌లోనూ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గతంలో అసోంలో చొరబాట్లు ఆపిన విషయాన్ని గుర్తు చేశారు. పదేళ్లలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు. రాష్ట్రంలో 30కి పైగా లోక్ సభ సీట్లలో బీజేపీ విజయం సాధించడం ఖాయమని తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లో మొత్తం ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.

Next Story