‘పేపర్ లీకేజీ నియంత్రణ’ బిల్లుకు పార్లమెంటు ఆమోదం

by Dishanational5 |
‘పేపర్ లీకేజీ నియంత్రణ’ బిల్లుకు పార్లమెంటు ఆమోదం
X

దిశ, నేషనల్ బ్యూరో: పోటీ పరీక్షల్లో అవకతవకలు, అక్రమాలను నియంత్రించడమే లక్ష్యంగా కేంద్రం తీసుకొచ్చిన బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అక్రమాల నివారణ) బిల్లు-2024’ శుక్రవారం రాజ్యసభలో వాయిస్ ఓటింగ్ ద్వారా పాస్ అయింది. బిల్లుపై చర్చ సమయంలో విపక్షాలు పలు సవరణలు ప్రతిపాదించగా, కేంద్రం తిరస్కరించింది. ఈ బిల్లు లోక్‌సభలో మంగళవారమే ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఉభయ సభల ఆమోదం పొందిన ఈ పేపర్ లీకేజీ నియంత్రణ బిల్లు.. రాష్ట్రపతి సంతకంతో త్వరలోనే చట్టరూపం దాల్చనుంది. ఇది అమల్లోకి వస్తే, కేంద్ర ప్రభుత్వ పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడినవారికి గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష, రూ.కోటి వరకు జరిమానా విధించనున్నారు.

అది తప్పుడు అభిప్రాయం: జితేంద్ర సింగ్

రాజ్యసభలో చర్చ సందర్భంగా ప్రతిపక్షాలు స్పందిస్తూ, ఈ బిల్లు ద్వారా విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగ ఆశావహులు నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశాయి. దీనికి కేంద్రమంత్రి జితేంద్ర జింగ్ సమాధానం ఇచ్చారు. ‘‘దేశంలోని యువశక్తిని అతి కొద్దిమంది చేతుల్లో బందీగా ఉంచడానికి లేదా త్యాగం చేయడాన్ని మేము అనుమతించబోము. ఉద్యోగం పొందాలనుకునే నిజాయితీగల అభ్యర్థిని లేదా విద్యార్థిని ఈ చట్టపరిధి నుండి దూరంగా ఉంచాము. కాబట్టి, ఈ కొత్త చట్టం ఈ దేశంలోని యువతను వేధించేలా ఉందనడం తప్పుడు అభిప్రాయం. ఇది వారి భవిష్యత్తుతో, తద్వారా దేశ భవిష్యత్తుతో ఆడుకుంటున్న వారిని అడ్డుకునేందుకు మాత్రమే ఉద్దేశించబడింది’’ అని సింగ్ అన్నారు.

Also Read..

బుక్​ఫెయిర్​లో ఆకట్టుకుంటున్న దిశ స్టాల్

Next Story

Most Viewed