భారత్ దెబ్బకు పాక్ పోర్టులు ఖాళీ.. ఫీడర్ సర్వీసులతో దాయాది దేశానికి భారీ నష్టం?

by Phanindra |

భారత్ దెబ్బకు పాక్ పోర్టులు ఖాళీ అయిపోతున్నాయి. దీంతో ఫీడర్ సర్వీసులతో ఆ దేశం బతుకుతోంది. దీని వల్ల దాయాది దేశానికి భారీ నష్టం జరుగుతోంది.

భారత్ దెబ్బకు పాక్ పోర్టులు ఖాళీ.. ఫీడర్ సర్వీసులతో దాయాది దేశానికి భారీ నష్టం?
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్ తీసుకున్న ఒక్క నిర్ణయంతో పాక్‌ భారీగా నష్టపోతోంది. పహెల్గాం ఉగ్రదాడి తర్వాత సింధూ జలాలను నిలిపివేసిన భారత్.. అదే సమయంలో పాక్‌కు వస్తువులు తీసుకెళ్లే, అలాగే పాక్ నుంచి వస్తువులు తీసుకొచ్చే నౌకలకు భారత పోర్టుల్లో ఎంట్రీ నిషేధించింది సర్కారు. దీంతో అసలే ఇబ్బందుల్లో ఉన్న పాక్ ఆర్థిక వ్యవస్థపై మరింత భారం పడుతోంది. పహెల్గాం ఉగ్రదాడి తర్వాత మే 3న పాకిస్తానీ నౌకలకు పోర్ట్ యాక్సెస్ నిలిపివేయడంతోపాటు ఆ దేశం నుంచి దిగుమతులను కూడా భారత్ నిషేధించింది. దీన్ని మరింత పొడిగిస్తూ పాక్‌కు ఎగుమతులు తీసుకెళ్లే నౌకలను కూడా తమ పోర్టుల్లోకి రానివ్వకూడదని భారత్ నిర్ణయించింది. ఈ కారణంతో పాకిస్తాన్‌కు వెళ్లే నౌకలను, భారత్‌కు వెళ్లే నౌకలను షిప్పింగ్ కంపెనీలు వేరు చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో షిప్పింగ్ సమయంతోపాటు ఫ్రెయిట్ చార్జీలు కూడా పెరుగుతున్నాయి.

ఈ క్రమంలో మదర్ షిప్పులు దాదాపు పూర్తిగా పాకిస్తాన్‌కు వెళ్లడం ఆపేస్తున్నాయి. దీంతో ఫీడర్ నౌకలపై పాక్ ఆధారపడాల్సి వచ్చింది. దీని వల్ల పాక్‌కు రావల్సిన దిగుమతులు కనీసం 30-50 రోజులు ఆలస్యం అవుతున్నట్లు సమాచారం. భారత్ తీసుకున్న నిర్ణయంతో ఇండియా, పాకిస్తాన్‌లలో ఏదో ఒక దేశాన్నే షిప్పింగ్ కంపెనీలు ఎంచుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. అదే సమయంలో 70 శాతం వస్తువులు భారత్‌వే కావడంతో చాలా కంపెనీలు పాకిస్తాన్‌ను వదిలేసినట్లు తెలుస్తోంది. అందుకే పాక్‌‌కు తీసుకెళ్లాల్సిన వస్తువులను కొలంబో, లేదా యూఏఈలోని జెబెల్ అలీ పోర్టులో వదిలేస్తున్నాయి. అక్కడి నుంచి ఫీడర్ సర్వీసును ఉపయోగించుకొని ఆ వస్తువులను పాక్‌ తీసుకెళ్తోందట. ఈ నేపథ్యంలో ఎగుమతులను పెంచేందుకు సుంకాలను 50 శాతం తగ్గించిన పాక్.. ఎగుమతులు పెరగాలంటే ఈ నిర్ణయం తప్పదని పాక్ మారిటైం మంత్రి ముహమ్మద్ జునైద్ అన్వన్ చౌదరీ స్పష్టంచేశారు.

Next Story