పాక్ అమ్ములపొదిలో డెడ్లీ వెపన్ ‘సోంగార్’.. భారత్ బూడిద చేసింది వీటినే..!

by Phanindra |
పాక్ అమ్ములపొదిలో డెడ్లీ వెపన్ ‘సోంగార్’.. భారత్ బూడిద చేసింది వీటినే..!
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌పై దాడి చెయ్యడానికి పాకిస్తాన్ ఏకంగా 400 డ్రోన్లను ఉపయోగించిందని రక్షణ శాఖ వెల్లడించింది. మొత్తం 36 ప్రాంతాలను పాక్ టార్గెట్ చేసిందని, అయితే తాము ఈ దాడులను తిప్పికొట్టామని కల్నల్ సోఫియా ఖురేషీ తెలిపారు. పాక్ ఉపయోగించిన డ్రోన్లన్నీ కూడా టర్కీకి చెందిన ఆసిస్‌గార్డ్ కంపెనీ తయారు చేసిన ‘సోంగార్’ మోడల్‌వేనని ఆమె ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో అసలు ఈ ‘సోంగార్’ డ్రోన్ల సామర్థ్యం ఏంటో తెలుసుకుందాం..

టర్కీ రాజధాని అంకారాలో రక్షణ రంగంలో వ్యాపారం చేసే ఆసిస్‌గార్డ్ కంపెనీ ఉంది. ఈ కంపెనీ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో సోంగార్ డ్రోన్లను తయారు చేసింది. వీటిని 2019లో టర్కీ సైన్యానికి అందుబాటులోకి వచ్చాయి. ఆ దేశం రక్షణతోపాటు బోర్డర్ వద్ద సైనిక చర్యల్లో కూడా ఈ డ్రోన్లు కీలకపాత్ర పోషిస్తున్నాయి. గురి తప్పకుండా టార్గెట్‌ను పేల్చేయడం, ఎలాంటి వాతావరణంలోనైనా పనిచెయ్యడంతోపాటు సర్వైలెన్స్, మిషన్ అనాలసిస్‌కు కూడా ఈ డెడ్లీ డ్రోన్లు ఉపయోగపడతాయి.

-సోంగార్‌ డ్రోన్లలో 200 రౌండ్ల కాల్పులు జరపగల నాటో స్టాండర్డ్ ఆటోమేటిక్ మెషీన్ గన్‌ ఉంటుంది. చాలా కచ్చితత్వంతో టార్గెట్లను షూట్ చేస్తుంది.

-45 కేజీల టేకాఫ్ వెయిట్‌ను ఈ డ్రోన్లు మోయగలవు. పేలోడ్ లేకపోతే 25-30 నిమిషాలు ఎగరగలవు.

-ఈ డ్రోన్ల ఆపరేషనల్ రేంజ్ 3-5 కిలోమీటర్లు. సముద్ర మట్టానికి 2800 కిలోమీటర్ల ఎత్తులో కూడా ఇవి పనిచేస్తాయి.

-రియల్ టైం వీడియో, టెలిమెట్రీ డేటాను షేర్ చేస్తాయి. తద్వారా సర్వైలెన్స్, టార్గెట్ డిటెక్షన్, మిషన్ అనంతరం విశ్లేషణకు సహకరిస్తాయి.

-సాధారణ కెమెరాతోపాటు ఇన్‌ఫ్రారెడ్ కెమెరా కూడా ఈ డ్రోన్లో ఉంటుంది. దీంతో పగలు, రాత్రి తేడా లేకుండా ఎలాంటి వాతావరణంలో మిషన్స్ పూర్తిచేస్తాయి.

-ఈ డ్రోన్ సిస్టంలో రూట్ ప్లానింగ్ చేస్తే ఆటోమేటిక్‌గా ఈ రూట్ ఫాలో అయ్యి మిషన్ కంప్లీట్ చేస్తుంది. అలాగే బ్యాటరీ పవర్ తక్కువగా ఉన్నా, కమ్యూనికేషన్ కోల్పోయినా దానికై అదే తిరిగి బేస్‌కు చేరుకుంటుంది. అవసరమైతే వీటిని రిమోట్‌గా కూడా కంట్రోల్‌ చేయొచ్చు.

-ఈ డ్రోన్లలో గ్రూప్ కోఆర్డినేషన్ సిస్టం కూడా ఉంది. కాబట్టి ఒకే సమయంలో వందలాది డ్రోన్స్ కలిసి అన్ని వైపుల నుంచి దాడి చెయ్యగలవు. మే 8న భారత్‌పై ఈ ట్యాక్టిక్‌నే పాకిస్తాన్ వాడింది.

ఈ డెడ్లీ డ్రోన్లు పాకిస్తాన్ అమ్ములపొదిలో శక్తిమంతమైన అస్త్రాలు. వీటిలో ఏకంగా 400 డ్రోన్లతో భారత్‌పై పాక్ దాడి చేసింది. అయినా సరే భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టం ‘సుదర్శన చక్ర’ వీటిని ధ్వంసం చేసింది. ఒక్కటంటే ఒక్క డ్రోన్ కూడా పాక్ అనుకున్న విధ్వంసాన్ని సృష్టించలేకపోయింది. ఆకాశంలో ఉండగానే అవి బూడిదైపోయాయి. ఆకాష్, ఎస్-400, స్పైడర్ వంటి వ్యవస్థలతో భారత్ ఎయిర్ డిఫెన్స్ దుర్భేద్యంగా ఉందని చెప్పడానికి ఇదే నిదర్శనం.



Next Story

Most Viewed