సామాజిక వ్యాప్తి దశలో ఒమిక్రాన్ మెట్రో నగరాల్లో అధికం

by Web Desk |
సామాజిక వ్యాప్తి దశలో ఒమిక్రాన్ మెట్రో నగరాల్లో అధికం
X

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సామాజిక వ్యాప్తి దశకు చేరుకుందని ఇన్సాకాగ్ నిపుణుల కమిటీ అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాల్లో ఈ వేరియంట్ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు కమిటీ అధ్యయనంలో పలు విషయాలు తెలిపింది. 'ఒమిక్రాన్ ప్రస్తుతం భారత్‌లో మెట్రో నగరాల్లో ప్రబలంగా వ్యాప్తి చెందుతుంది. దీంతో కేసుల సంఖ్య కూడా పెరుగుతున్నాయి' అని వెల్లడించింది. ఒమిక్రాన్ ఉప వేరియంట్‌ను భారత్‌లో గుర్తించినట్లు తెలిపింది. చాలా కేసుల్లో లక్షణాలు లేకపోవడం లేదా స్వల్ప లక్షణాలు ఉన్నట్లు పేర్కొంది. అయితే తాజా వేవ్‌లో ఆసుపత్రుల్లో చేరికలు, ప్రాణాపాయ పరిస్థితులు పెద్దగా లేవని వెల్లడించింది.

'భారత్‌లో ప్రస్తుతం ఒమిక్రాన్ వ్యాప్తి విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ద్వారా కాకుండా, దేశీయంగానే జరుగుతుంది. వైరస్ సంక్రమణ దేశీయంగా మారుతున్న నేపథ్యంలో జన్యుపరమైన నిఘాతో వ్యాప్తిని నివారించడానికి నమూనాల సేకరణ, సీక్వెన్సింగ్ వ్యూహం రూపొందించబడింది' అని నివేదికలో తెలిపింది. కొవిడ్ నిబంధనలు పాటించడం, వ్యాక్సినేషన్ కరోనా నుంచి రక్షణ గా ఉంటాయని పేర్కొంది. ఇప్పటివరకు 1,50,710 నమునాలను సీక్వేన్సింగ్‌కు పంపగా, 1,27,697 నమూనాలను ఇన్సాకాగ్ విశ్లేషించింది. ఇక ఇప్పటికే దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 10వేలు దాటిన సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed