ఢిల్లీ మేయర్‌గా షెల్లీ ఒబెరాయ్ ఏకగ్రీవం

by Disha Web Desk 12 |
ఢిల్లీ మేయర్‌గా షెల్లీ ఒబెరాయ్ ఏకగ్రీవం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశరాజధాని ఢిల్లీ మేయర్ ఎన్నిక ఎట్టకేలకు ప్రశాంతంగా ముగిసింది. ఢిల్లీ మేయర్ పీఠాన్ని వరుసగా రెండోసారి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కైవసం చేసుకుంది. చివరి నిమిషంలో బీజేపీ అభ్యర్థి శిఖారాయ్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో...ఆప్ పార్టీకి చెందిన షెల్లీ ఒబెరాయ్ ఢిల్లీ మేయర్‌గా బుధవారం తిరిగి ఎన్నికయ్యారు. మేయర్ ఎన్నికకు తగినంత బలం లేకపోవడంతో బీజేపీ వెనక్కి తగ్గింది. ఇక డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా అలాగే జరగడం విశేషం. ఆప్ అభ్యర్థి ఆలీ మహమ్మద్ ఇక్బాల్ డిప్యూటీ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎంసీడీ ప్రధాన కార్యాలంలో పోలింగ్ జరిగింది. ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికైన షెల్లీ ఒబెరాయ్, మహమ్మద్ ఇక్బాల్‌లకు సీఎం అరవింద్ కేజ్రివాల్ ట్విట్టర్ వేదికగా కంగ్రాట్స్ చెప్పారు.

ప్రజలకు ఆప్‌పై ఎన్నో అంచనాలు ఉన్నాయని, వారి అంచనాలను నెరవేర్చేందుకు కష్టపడి పనిచేద్దామంటూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఇక, ఎన్నిక ప్రక్రియ పూర్తవగానే ఢిల్లీ మున్సిపల్ సభా కార్యకలాపాలను మేయర్ షెల్లీ ఒబెరాయ్ మే 2కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, ఢిల్లీ మేయర్ ఎన్నిక రొటేషనల్ పద్ధతిలో ఐదు సింగిల్ ఇయర్స్ టర్మ్‌తో ఉంటుంది. తొలి సంవత్సరం మహిళలకు రిజర్వ్ చేయగా, రెండో సంవత్సరం ఓపెన్ కేటగిరిగా, మూడు సంవత్సరం రిజర్వ్‌డ్ కేటగిరిగా, తక్కిన రెండేళ్లు ఓపెన్ కేటగిరిగా ఉంది. దాదాపుగా 15 ఏళ్లుగా ఢిల్లీ మున్సిపాలిటీని సొంతం చేసుకున్న బీజేపీ ఈ ఎన్నికల్లో ఓడిపోయింది.



Next Story

Most Viewed