కేంద్ర బడ్జెట్‌పై ప్రియాంకా గాంధీ విమర్శలు

by Dishanational1 |
కేంద్ర బడ్జెట్‌పై ప్రియాంకా గాంధీ విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో కొత్త ఉద్యోగాల కల్పనపై ఎలాంటి విజన్, ప్రణాళిక లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఆరోపించారు. నిరుద్యోగంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అతిపెద్ద దురదృష్టకరమని అన్నారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగాన్ని అరికట్టడంతో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం విఫలమైంది. వారి మధ్యంతర బడ్జెట్ సమాజంలోని ప్రతి వర్గాన్ని నిరాశపరిచిందన్నారు. శుక్రవారం ఎక్స్‌లో ట్వీట్ చేసిన ప్రియాంకా గాంధీ, దేశ ప్రజలు ఎదుర్కొంటున్న రెండు అతిపెద్ద సమస్యలు నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అని అన్నారు. ఈ రెండు సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అని ప్రశ్నించారు. దేశంలో నిరుద్యోగం అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. ఐఐఎం, ఐఐటీల లాంటి పెద్ద విద్యాసంస్థలు ప్లేస్‌మెంట్ల సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. కొత్త ఉద్యోగాలను సృష్టించేందుకు, నిరుద్యోగాన్ని ఎదుర్కొనేందుకు బడ్జెట్ ఎలాంటి చర్యలు లేవని విమర్శించారు. ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న సామాన్య ప్రజలు ఈ మధ్యంతర బడ్జెట్‌తో నిరాశకు గురయ్యారు. పేద, మధ్యతరగతి వర్గాలు గత పదేళ్లుగా ఉపశమనం కోసం ఎదురుచూస్తున్నారు. మధ్యతరగతి ప్రజలకు ఎలాంటి పన్ను రాయితీ ఇవ్వలేదని ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు.


Next Story

Most Viewed