రాజకీయాల్లో ఏ సీటూ ఖాళీగా లేదు.. రాహుల్‌గాంధీపై అమిత్‌ షా సెన్సేషనల్ సెటైర్లు

by Kema Shiva Kumar |

రాజకీయాల్లో ఏ సీటు ఖాళీగా లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు.

రాజకీయాల్లో ఏ సీటూ ఖాళీగా లేదు.. రాహుల్‌గాంధీపై అమిత్‌ షా సెన్సేషనల్ సెటైర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: రాజకీయాల్లో ఏ సీటు ఖాళీగా లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు. బిహార్ (Bihar) ఎన్నికల ప్రచారంలో భాగంగా దర్భంగా (Darbhanga)లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ (Congress), ఆర్‌జేడీ (RJD)లపై విమర్శనాస్త్రాలను సంధించారు. బీహార్‌లో వంశపారంపర్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని విపక్షాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ తన కుమారుడు తేజస్వీ యాదవ్‌ను ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నారని, సోనియాగాంధీ రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని ప్రధానిని చేయాలనుకుంటున్నారని పేర్కొన్నారు. బీహార్‌లో సీఎం సీటు.. ఢిల్లీలో పీఎం సీట్లు ఖాళీ లేవంటూ సెటైర్లు వేశారు.

బిహార్‌ను దేశంలో అగ్ర పథాన నిలిపేందుకు బీజేపీ యువతపై దృష్టి పెడుతోందని అన్నారు. ఈ క్రమంలోనే 25 ఏళ్ల మైథిలీ ఠాకూర్ అనే గాయనికి పార్టీ టికెట్ ఇచ్చామని గుర్తు చేశారు. నీతీష్ కుమార్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అత్యద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. జీవికా దీదీలకు ఆర్థిక సాయం, పెన్షన్ పెంపు వంటివి ఇందులో ఉన్నాయని తెలిపారు. ఫోడర్ స్కామ్, ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్‌లతో ఆర్జేడీ బిహార్‌ను లూఠీ చేసిందని కామెంట్ చేశారు. మిథిలా సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడేందుకు దర్భంగాలో రూ.500 కోట్లతో సాంస్కృతిక మ్యూజియాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. సంవత్సరాల తరబడి శ్రీరాముడు ఓ గుడారంలో ఉన్నాడని.. నాటి యూపీఏ ప్రభుత్వంలో ఉన్న టీఎంసీ, సమాజ్‌వాదీ, ఆర్జేడీ పార్టీలు ఎవరూ రామ మందిరం నిర్మాణాన్ని పట్టించుకోలేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో రామ మందిరాన్ని నిర్మించామని అన్నారు. బిహార్‌కు నీతీష్ కుమార్, చిరాగ్ పాశ్వాన్ నాయకత్వం ఉందని, ప్రధాని ఆశీస్సులు కూడా వారికి ఉన్నాయని, ఈ ఎన్నికల్లో బలంగా నిలుస్తామని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.

Next Story