ముస్లింలకు బీజేపీ, కాంగ్రెస్ నో టికెట్ !

by Dishanational4 |
ముస్లింలకు బీజేపీ, కాంగ్రెస్ నో టికెట్ !
X

దిశ, నేషనల్ బ్యూరో : రాజస్థాన్‌లో కాంగ్రెస్, బీజేపీలు ఈసారి ముస్లిం అభ్యర్థులకు ఒక్క లోక్‌సభ సీటును కూడా కేటాయించలేదు. రాష్ట్రంలోని 10 శాతం ఓటుబ్యాంకు ముస్లింలకు ఉన్నా.. అతిపెద్ద సామాజిక వర్గాల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నా ఆ వర్గానికి టికెట్లు కేటాయించడానికి రెండు దిగ్గజ జాతీయ పార్టీలూ ఆసక్తి చూపలేదు. ఇప్పటివరకు రాజస్థాన్‌లోని మొత్తం 25 సీట్లకుగానూ 24 స్థానాలకు బీజేపీ, కాంగ్రెస్‌లు అభ్యర్థుల పేర్లను ప్రకటించాయి. భిల్వారా స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉండగా.. బన్స్వారా-దుంగార్‌పూర్ స్థానాన్ని ప్రస్తుతానికి కాంగ్రెస్ పెండింగ్‌లో ఉంచింది. వాస్తవానికి గత ఎన్నికల్లో కనీసం ఒక లోక్‌సభ టికెట్‌నైనా ముస్లిం వర్గానికి కేటాయించిన ట్రాక్ రికార్డు కాంగ్రెస్ పార్టీకి ఉంది. స్థానికంగా బలమైన నేతలు లేనప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి ముస్లిం నేతలను తీసుకొచ్చి మరీ పోటీకి నిలిపిన దాఖలాలూ ఉన్నాయి. ఈసారి మాత్రం అలాంటి ప్రయోగాలకు ఛాన్స్ లేదన్న తీరులో హస్తం పార్టీ టికెట్లను కేటాయించింది. మచ్చుకు పరిశీలిస్తే.. రాజస్థాన్ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి అమీన్ ఖాన్ ఈసారి బార్మర్ జిల్లాలోని షియో లోక్‌సభ స్థానం కోసం అప్లై చేయగా కాంగ్రెస్ పార్టీ నో చెప్పింది. ఆయన గతంలో 11 ఎన్నికల్లో పోటీచేసి ఐదుసార్లు గెలిచారు. అయినా టికెట్‌ను పొందలేకపోయారు. ఈ పరిణామాలు రాష్ట్రంలోని ముస్లిం ఓటుబ్యాంకును ప్రత్యామ్నాయాల వైపు నడిపిస్తాయనే అభిప్రాయం కాంగ్రెస్ మైనారిటీ నేతల్లో వ్యక్తమవుతోంది. తద్వారా ముస్లిం ప్రాబల్యం గణనీయంగా ఉన్న 10 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగులుతుందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.


Next Story

Most Viewed