ఐదోసారీ జంప్.. రేపే నితీశ్ రాజీనామా.. వెంటనే సీఎంగా ప్రమాణం

by Dishanational4 |
ఐదోసారీ జంప్.. రేపే నితీశ్ రాజీనామా.. వెంటనే సీఎంగా ప్రమాణం
X

దిశ, నేషనల్ బ్యూరో : ఇండియా కూటమి తొలి మీటింగ్‌కు వేదికగా నిలిచిన బిహార్‌‌లో పాగా వేయడంలో బీజేపీ సక్సెస్ అయింది. ఆదివారం (జనవరి 28) ఆ మార్పుకు అద్దంపట్టే కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. జేడీయూ చీఫ్, ప్రస్తుత సీఎం నితీశ్ కుమార్‌తో కలిసి కొత్త ప్రభుత్వాన్ని కమలదళం ఏర్పాటు చేయనుంది. ఆదివారం ఉదయం 10 గంటలకు గవర్నర్‌కు నితీశ్ రాజీనామా లేఖను సమర్పించి.. బీజేపీ మద్దతుతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరనున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు సీఎంగా నితీష్ ప్రమాణస్వీకారం చేస్తారని జేడీయూ వర్గాలు చెబుతున్నాయి. పొత్తులో భాగంగా బీజేపీకి రెండు ఉపముఖ్యమంత్రి పదవులతో పాటు స్పీకర్ పదవిని నితీశ్ ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా నితీశ్‌తో కలిసి ఎన్డీఏ కూటమిలోకి వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదంతా జరిగిపోతే తదుపరిగా విశ్వాస పరీక్ష ద్వారా నితీశ్‌ కుమార్‌కు సవాల్ విసరాలని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ యోచిస్తున్నారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 5న బిహార్ బడ్జెట్‌ సమావేశాల్లో తొలిరోజున విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ఆర్జేడీ చీఫ్ భావిస్తున్నారు. మహాకూటమి నుంచి నితీశ్ ఫిరాయించిన తీరుపై బిహార్‌ అసెంబ్లీలో చర్చించాలని కూడా లాలూ పార్టీ ప్లాన్ చేస్తోంది. మరోవైపు నితీశ్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం పాట్నాకు వస్తున్నారు. 40 లోక్‌సభ సీట్లున్న బిహార్‌ హిందీ బెల్ట్‌లో బీజేపీకి చాలా కీలకమైంది. అందుకే సరిగ్గా లోక్‌సభ ఎన్నికలకు ముందు కమలనాథులు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మార్చేందుకు ఇంత పెద్ద స్కెచ్‌ను అమలుచేశారు.


Next Story