ఇండియా కూటమిలో ఉంటే నితీష్ ప్రధాని అయ్యేవారు: అఖిలేష్ యాదవ్

by Dishanational1 |
ఇండియా కూటమిలో ఉంటే నితీష్ ప్రధాని అయ్యేవారు: అఖిలేష్ యాదవ్
X

దిశ, నేషనల్ బ్యూరో: సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ బీహార్‌లో రాజకీయ పరిణామాలపై స్పందించారు. బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ ఇండియా కూటమి వైపే నిలబడి ఉంటే ప్రధాని అయ్యే వారని అన్నారు. శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిలో ఎవరినైనా ప్రధానమంత్రి పదవికి పరిశీలించవచ్చు. నితీష్ కుమార్ బలమైన మద్దతు ఇస్తే ఆయన ప్రధాని పోటీదారుల్లో ముందుండేవారన్నారు. నితీష్ కుమార్ ఎప్పటిలాగే యూటర్న్ తీసుకోవడం పట్ల నిరుత్సాహం వ్యక్తం చేసిన అఖిలేష్, జేడీయూ అధినేత ఇప్పటికీ ఇండియా కూటమిలోనే కొనసాగాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. నితీష్ చొరవతోనే ఇండియా కూటమి ఏర్పాటైందని, తాజా వ్యవహారాన్ని పరిష్కరించేలా కాంగ్రెస్ ముందుకు రావాల్సిన అవసరం ఉందని అఖిలేష్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ వంటి అసంతృప్త కూటమి భాగస్వాములకు ఇబ్బందులు ఉన్న సమయంలో 'కాంగ్రెస్ ముందుకు వచ్చి ఉండాల్సింది' అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే సందర్భంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీతో కలిసి ఎన్నికల ప్రచారం చేసే అంశంపై అడిగిన ప్రశ్నకు, అలాంటి పరిస్థితి కార్యరూపం దాలుస్తుందో లేదో కాలమే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు.


Next Story